Musk Effect on Twitter | ప్రస్తుతం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ కొనసాగుతున్నారు. ఈ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ను టెస్లా-స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ట్విట్టర్ యాజమాన్యం పట్ల విశ్వాసం లేదని ఇంతకుముందు ఎలన్మస్క్ పదేపదే చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలన్మస్క్ చేతికి ట్విట్టర్ అధికారికంగా చిక్కిన తర్వాత ఉద్వాసనకు గురైతే పరాగ్ అగర్వాల్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సంస్థ సీఈవోగా నియమితులైన 12 నెలల్లోపు ఉద్వాసనకు గురైతే పరాగ్ అగర్వాల్కు ట్విట్టర్ యాజమాన్యం.. 42 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని రీసెర్చ్ సంస్థ ఈక్విలార్ ( Equilar ) అంచనా వేసింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నుంచి సీఈవోగా పరాగ్ అగర్వాల్ గతేడాది నవంబర్లో బాధ్యతలు చేపట్టారు.
సుమారు 44 బిలియన్ల డాలర్లకు ఎలన్మస్క్ టేకోవర్ చేసిన తర్వాత టౌన్హాల్లో సిబ్బందితో పరాగ్ అగర్వాల్ భేటీ అయ్యారు. ఎలన్మస్క్ చేతికి వెళ్లిన ట్విట్టర్ భవితవ్యం అనిశ్చితిగా ఉంటుందని పరాగ్ అగర్వాల్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత దశలో లే ఆఫ్లు ఉండకపోవచ్చునని అన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థ బోర్డుపై ఎలన్మస్క్కు విశ్వాసం లేదు. ఈ మేరకు ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. గతేడాది ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా వైదొలిగి సీఈవోగా బాధ్యతలు చేపట్టినందుకు పరాగ్ అగర్వాల్కు 30.4 మిలియన్ డాలర్ల పరిహారం అందింది.