న్యూఢిల్లీ : చాట్జీపీటీ (ChatGPT) వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి. వీటి సానుకూల, ప్రతికూల ప్రభావాలపై టెక్ దిగ్గజాల నుంచి సామాన్యుల వరకూ అంచనాలు వేస్తున్నారు. ఏఐ టూల్స్తో పెద్దసంఖ్యలో కొలువులు కోల్పోతామనే ఆందోళనా సర్వత్రా వ్యక్తమవుతోంది. అందివచ్చే న్యూ టెక్నాలజీలను ఎవరైనా అలవరచుకోవాలని, ఏఐ టూల్స్తో నూతన ఉద్యోగావకాశాలూ ముందుకొస్తాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. ఇక తాజాగా చాట్జీపీటీపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్, నోబెల్ బహుమతి అందుకున్న ఎకనమిస్ట్ క్రిస్టఫర్ పిసరైడ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కృత్రిమ మేథతో కూడిన చాట్బాట్స్కు కార్మిక మార్కెట్ సులభంగా అలవాటు పడుతుందని, చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్తో వారానికి నాలుగు పనిదినాల సంస్కృతికి దారితీస్తుందని అన్నారు. ఏఐ చాట్బాట్స్తో ఉత్పాదకత మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వారానికి నాలుగు రోజుల పని పద్ధతిని కేవలం కొద్ది కంపెనీలే అనుసరిస్తుండగా ఏఐ టూల్స్ ప్రాధాన్యత పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ ఊపందుకుంటుందని ఓ సెమినార్లో మాట్లాడుతూ క్రిస్టఫర్ పిసరైడ్స్ చెప్పుకొచ్చారు.
పని భారం నుంచి మనం ఉపశమనం పొందుతూ ఎక్కువగా విశ్రాంతి తీసుకునే వాతావరణం ఉంటుందని, ఏఐ టూల్స్ విస్తృతితో మనం వారానికి నాలుగు రోజుల పని పద్ధతికి సులభంగా మళ్లగలమని తాను భావిస్తున్నానని క్రిస్టఫర్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం పనిలో చేస్తున్న ఎన్నో విసుగు పుట్టించే విషయాలను అవి (ఏఐ టూల్స్) తొలగిస్తాయని, మనకు ఆసక్తికరమైన విషయాలనే మిగుల్చుతాయని వ్యాఖ్యానించారు. ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన చాట్జీపీటీకి యూజర్ల నుంచి అద్భుతమైన స్పందన రాగా, దీనికి పోటీగా గూగుల్ వైరల్ చాట్బాట్ బార్డ్ను లాంఛ్ చేసింది.
Read More