ముసలివాళ్లు యవ్వనంలోకి ఎలా మారిపోవచ్చని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏజ్ను తగ్గించే కొత్త మంత్రం కనుగొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని బాబ్రహం ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ వోల్ఫ్ రీక్, అతడి బృందం ఓ సరికొత్త ప్రయోగంతో ప్రపంచం ముందుకు వచ్చింది. 53 ఏళ్ల వయస్సుగల మహిళ చర్మకణాలకు, చికిత్సచేసి పునరుజ్జీవం పోసింది. ఈ చికిత్స తర్వాత సదరు మహిళ చర్మకణాలు ఆమె 23 ఏళ్ల వయస్సులో ఉన్నస్థితికి వచ్చాయి.
ఈ ప్రయోగానికి 25 ఏళ్ల క్రితం క్లోనింగ్ గొర్రె డాలీని సృష్టించడంలో ఉపయోగించిన సాంకేతికతను కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధకులు ఆధారం చేసుకున్నారు. వృద్ధాప్యంలో వచ్చే మధుమేహం, గుండె జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులకు చికిత్సలను అభివృద్ధి చేయడమే ఈ ప్రయోగ లక్ష్యమని ప్రొఫెసర్ వోల్ఫ్ రీక్ పేర్కొన్నారు. వయస్సు పెరిగినా కొద్ది మనుషులకు రోగాలు పెరుగుతుంటాయన్నారు. ఏజ్ పెరిగినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనుషులు జీవించేలా కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.