Twitter | సంచలన నిర్ణయాలకు మారుపేరు టెస్లా.. కాదు కాదు ట్విట్టర్ నూతన యజమాని ఎలన్మస్క్. ఖాతాదారులు, ప్రజల వాక్స్వాతంత్య్రం పెంపొందించడమే లక్ష్యంగా ట్విట్టర్ను టేకోవర్ చేస్తున్నానని ఇంతకుముందు ప్రకటనలిచ్చారు. కానీ, అదే ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాలను సిబ్బంది ప్రశ్నించడం ఎలన్మస్క్కు ఏమాత్రం నచ్చలేదు. అంతే ఇద్దరు ఇంజినీర్లను ఇండ్లకు సాగనంపేశారు. ట్విట్టర్లో వాక్స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడానికి ఆ సంస్థను టేకోవర్ చేస్తున్నానని చెప్పి.. అదే వాక్స్వేచ్ఛను ఉపయోగించుకున్న ఇద్దరు ఉద్యోగులను తొలగించడంపై నెట్టింట విమర్శల హోరెత్తుతున్నది.
ట్విట్టర్ న్యూబాస్ ఎలన్మస్క్ ఆగ్రహానికి గురైన ఇంజినీర్లు.. ఎరిక్ ఫ్రోన్హోఫర్, బెన్లీబ్. ఎరిక్ ఫ్రోన్హోఫర్ గతంలో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లో ట్విట్టర్ యాప్పై పని చేశారు. ఇంతకుముందు ట్విట్టర్పై ఎలన్మస్క్ చేసిన ట్వీట్ను ఎరిక్ రెండ్రోజుల క్రితం రీ ట్వీట్ చేశారు. `ట్విట్టర్ యాప్లో సాంకేతికపరమైన అంశాలను మస్క్ అర్థం చేసుకున్న తీరు తప్పు` అని పేర్కొన్నారు. దీనిపై ట్విట్టర్లోనే రియాక్టయిన ఎలన్మస్క్.. అదెలాగో వివరించాలని ట్వీట్ చేశారు. దానికి ముందు ఆండ్రాయిడ్లో ట్విట్టర్ నెమ్మదిగా ఉండటానికి కారణం ఏమిటీ.. ఆ సమస్య పరిష్కారానికి మీరు తీసుకున్న చర్యలేంటని ఎరిక్ను ప్రశ్నించారు. ఎలన్మస్క్ ట్వీట్కు రిప్లయ్ ఇస్తూ ఎరిక్ పలు ట్వీట్లు చేశారు.
మధ్యలో ఓ యూజర్ స్పందిస్తూ.. `మీరు వ్యక్తిగతంగా ఈ అంశాలను మస్క్తో ఎందుకు షేర్ చేసుకోలేదు` అని ప్రశ్నించారు. మస్క్ కూడా మెయిల్ ద్వారా గానీ, స్లాక్ ద్వారా గానీ సిబ్బందితో సంప్రదింపులు జరిపితే బాగుండేదని ఎరిక్ రియాక్టయ్యారు. ఫలితంగా సోమవారం ఎరిక్ ఫ్రోన్హోఫర్ను తొలగిస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా ఎరిక్ `సెల్యూట్` ఏమోజీ పోస్ట్ చేశారు.
ఎరిక్ ఫ్రోన్హోఫర్ మాదిరే ఉద్వాసనకు గురైన బెన్లీబ్ కూడా ఎలన్మస్క్ ఇంతకుముందు చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని మస్క్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అలా చేసినందుకు పదేండ్లుగా పని చేస్తున్న తనకు ఉద్వాసన పలికారని తెలిపారు.
ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి సంస్థలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య కమ్యూనికేషన్ల వ్యవస్థలోనూ మార్పు వచ్చిందని సమాచారం. ఇప్పుడంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ట్విట్టర్లో టెక్నికల్ అంశాలు తలెత్తే అవకాశం ఉందని ఆ వర్గాల ఆందోళన.