Microsoft | ఇటీవల ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కు శాశ్వతంగా వీడ్కోలు పలికిన టెక్ మేజర్ మైక్రోసాఫ్ట్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. మరో ఓఎస్కు గుడ్బై చెబుతున్నట్లు తెలిపింది. విండోస్ 8.1 ఓఎస్కు తమ సపోర్ట్ ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి విండోస్ 8.1 ఓఎస్కు సపోర్ట్ ఉండదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీనివల్ల విండోస్ 8.2 ఓఎస్ యూజర్లు.. మైక్రోసాఫ్ట్ నుంచి సెక్యూరిటీ అప్డేట్లు పొందలేరు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ విండోస్ 8.1 కూడా సపోర్ట్ చేయవని వివరించింది. ఈ విషయమై మైక్రోసాఫ్ట్ తన యూజర్లకు నోటిఫికేషన్ల ద్వారా వెల్లడించనున్నది.
2012లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన విండోస్ 8ఓఎస్లో కొన్ని లోపాటు ఉన్నాయి. దీంతో 2013లో విండోస్ 8కు స్టేబుల్ వర్షన్ విండోస్ 8.1ను విడుదల చేసింది. తర్వాత రెండేండ్లకు అంటే 2015లో దాని అడ్వాన్స్ వర్షన్గా విండోస్ 10, 2021లో విండోస్ 11 తెచ్చింది.
మైక్రోసాఫ్ట్ తన యూజర్లకు మెరుగైన భద్రతతో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి విండోస్ 8.1 సేవలు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కనుక విండోస్ 8.1 వాడుతున్న యూజర్లు ఇక విండోస్10 లేదా విండోస్ 11కు అప్డేట్ కావాలని సూచించింది. కాగా, 2025 అక్టోబర్ కల్లా విండోస్ 10కు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఉపసంహరించుకోనున్నదని సమాచారం. కనుక యూజర్లు విండోస్ 11కు అప్గ్రేడ్ కావాలంటున్నారు. ఒకవేళ కంప్యూటర్లో అవసరమైన ఫీచర్లు లేకుంటే విండోస్ 10కు అప్డేట్ కావడం ఉత్తమం అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాడుతున్న కంప్యూటర్లు శక్తిమంతంగా ఎంతో వేగంగా పని చేస్తాయి. వాటిలో చాలా వరకు విండోస్ 11 ఓఎస్ ఉంటుంది. విండోస్ 10, 11 ఓఎస్లకు పాత కంప్యూటర్లలోని హార్డ్వేర్ ఫీచర్లు సపోర్ట్ చేయవు. కనుక యూజర్లు తమ కంప్యూటర్లతోపాటు ఓఎస్ అప్డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ పేజీలో తెలిపింది.