Gaganyaan Mission | త్వరలో గగనతలంలోకి ఇస్రో మానవ సహిత ఉపగ్రహం గగన్యాన్ను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. మానవ సహిత ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుండటం ఇదే తొలిసారి. భూమికి అతి తక్కువ ఎత్తులో వ్యోమగాములను తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ఉపగ్రహ ప్రయోగం జరుగనున్నది. ఈ నేపథ్యంలో అంతరిక్ష ప్రయాణంలో వ్యోమగాములపై ప్రభావం అర్థం చేసుకోవడానికి ఇస్రో ప్రయత్నిస్తున్నది. అందుకు అనుగుణంగా స్పేస్క్రాఫ్ట్ను డిజైన్ చేస్తున్నది. దీని కోసం వైద్యుల సాయం కోరింది. ఆర్బిటల్ మాడ్యూల్ తయారీలో భాగస్వాములను చేసేందుకు నలుగురు వ్యోమగాములను ఇప్పటికే ఇస్రో ఎంపిక చేసింది.
ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఉపగ్రహం కాక్పిట్లో కూర్చుంటారు. ఉపగ్రహంలో వివిధ పరికరాలు సరైన ప్రదేశంలోనే ఏర్పాటు చేస్తున్నామా.. లేదా.. లైటింగ్ సరిగ్గా ఉందా.. అసౌకర్యమైన పరిస్థితులేమైనా ఉన్నాయా? అని వారి నుంచి అడిగి తెలుసుకుంటామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం అంతరిక్ష పరిజ్ఞానం వినియోగంపై ఆరోగ్య నిపుణులతో జరిగిన మేధోమధనంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు మానవ సహిత ఉపగ్రహం ( human-rated spacecraft ) అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
మానవ సహిత ఉపగ్రహ తయారీలో డాక్టర్లు ఎలా అనుసంధానం అవుతారన్న అంశాన్ని పరిశీలిస్తాం అని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ తెలిపారు. మానవ సహిత ఉపగ్రహ ప్రయోగంలో భాగస్వాములయ్యేందుకు శక్తిమంతమైన వైద్యుల బృందం అవసరం ఉందన్నారు. మానవ సహిత ఉపగ్రహం
గగన్యాన్ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత గగన్యాన్లను ఇస్రో ప్రయోగించనున్నది.
మానవ సహిత ఉపగ్రహం.. వ్యోమగాములు నివసించడానికి సాధారణ పరిస్థితులు ఉండేలా.. ఉపగ్రహ సిబ్బందిగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా గగన్యాన్ను రూపొందించాల్సి ఉంటుందని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. స్పేస్ క్రాఫ్ట్లో ప్రమాదాలు తలెత్తకుండా.. విపత్కర పరిస్థితులను నియంత్రణించడానికి వీలుగా వ్యవస్థలను ఇంజినీర్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రమాదకర పరిస్థితుల నుంచి క్రూ సిబ్బంది సురక్షితంగా కోలుకునేలా వసతులు కల్పించాల్సి ఉంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.