Embryo | పురుషుల వీర్యకణాలు.. మహిళల్లోని అండాలు కలిసి ఫలదీకరణం చెందితేనే పిండం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పిండం.. నవమాసాలు తల్లి గర్భాశయంలో ఎదిగి శిశువుగా భూమిపైకి వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు అద్భతాన్ని ఆవిష్కరించారు. అండం, వీర్యకణాల అవసరం లేకుండానే కృత్రిమంగా ల్యాబ్లో ఓ పిండాన్ని తయారు చేశారు. గర్భాశయంలో ఏర్పడిన మానవ పిండం ఎలా ఉంటుందో.. అచ్చం అలాంటి కృత్రిమ పిండాన్ని రూపొందించారు. ఇప్పుడీ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ కృత్రిమ పిండాన్ని ఎలా.. ఎందుకు తయారు చేశారు? దీని వెనుక ఉద్దేశమేంటో ఓ సారి లుక్కేయండి..
ఇజ్రాయెల్లోని వెయిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ పిండాన్ని అభివృద్ధి చేశారు. మానవ పిండాన్ని అభివృద్ది చేయడానికి కంటే ముందు వీళ్లు ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎలుకల నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ను ల్యాబ్లోని ఒక కంటైనర్లో భద్రపరిచారు. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందులోని పోషక జలం ప్రభావంతో వీర్యకణాలు, అండాలు లేకుండా స్టెమ్ సెల్స్ ఫలదీకరణం చెంది.. అండం ఏర్పడింది. ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు కృత్రిమంగా మానవ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఈ కృత్రిమ పిండం నిర్మాణం పూర్తిగా మానవ పిండాన్నే పోలి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవ పిండంలో ఉన్నట్లుగానే ప్లాసెంటా, యోక్ సాక్, క్రోనిక్ సాక్, ఇతర కణజాలాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా పిండం అభివృద్ధి కూడా తల్లి కడుపులో ఉన్నట్లుగానే ఉందని తెలిపారు.
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో భాగంగా ముందు స్టెమ్ సెల్స్ను ప్రధానంగా నాలుగు రకాల కణాలుగా విడగొట్టారు. ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్, ఎక్స్ట్రాఎంబ్రియోనిక్ మెసొడెర్మ్, ట్రోపోబ్లాస్ట్ అనే నాలుగు రకాల కణాలుగా స్టెమ్ సెల్స్ను వేరు చేశారు. ఈ నాలుగు రకాల కణాలను పలు రసాయనాల సహాయంతో నిర్ణీత నిష్పత్తి కలిపి ల్యాబ్ల్లో ప్రయోగం చేయడంతో కృత్రిమ పిండం అభివృద్ధి చెందింది. అప్పుడు ఎపిబ్లాస్ట్ కణాలు పిండంగా అభివృద్ధి చెందాయి. పిండం అభివృద్ది చెందడానికి కావాల్సిన ఆక్సిజన్, న్యూట్రిషన్స్ అందించే ప్లాసెంటాగా ట్రోపోబ్లాస్ట్ సెల్స్ అభివృద్ధి చెందాయి. ఇక హైపోబ్లాస్ట్ కణాలు యోక్ సాక్ సపోర్టింగ్గా ఉండగా.. ఎక్స్ట్రాఎంబ్రియోనిక్ మెసొడెర్మ్ పిండం నిర్మాణంలో సహాయపడ్డాయి.
ల్యాబ్ల్లో కృత్రిమ పిండం అభివృద్ధి చేయడం వల్ల వైద్య రంగం, మెడిసిన్ తయారీల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో గర్భిణులపై క్లినికల్ ట్రయల్స్కు అనుమతించరు. దీంతో మానవ గర్భాశయంలోని పిండం అభివృద్ధి చెందే సమయంలో ఏ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై స్పష్టత తక్కువగా ఉంది. కాబట్టి కృత్రిమ పిండాలు అభివృద్ధి చేయడం వల్ల వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కృత్రిమ పిండం రోజులదేనని.. నెలలు నిండినా కొద్దీ అవయవాలు అభివృద్ధి చెందడం మొదలవుతుందని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాకబ్ హన్నా వివరించారు. అలా ఏర్పడిన అవయవాలను అవసరం ఉన్న పేషెంట్లకు మార్పిడి చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.