న్యూఢిల్లీ : టెక్ కంపెనీలకు గడ్డు కాలం నడుస్తోంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దాదాపు 3700 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ బ్రెయిన్లీ తన ఇండియా టీమ్ మొత్తాన్ని ఇంటికి పంపింది. పోలండ్కు చెందిన ఎడ్యుటెక్ కంపెనీ బ్రెయిన్లీ భారత్లో మాస్ లేఆఫ్స్కు తెగబడింది.
బెంగళూర్లోని యూబీ సిటీ కార్యాలయం నుంచి పనిచేస్తున్న 35 మందిని కంపెనీ తొలగించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో పలువురిని బ్రెయిన్లీ సాగనంపింది. అక్టోబర్ 28న గూగుల్ మీట్ కాల్ ద్వారా దాదాపు మొత్తం ఇండియా టీమ్ను కంపెనీ తొలగించిందని భారత్ టీంలో కేవలం ఐదుగురిని మాత్రమే కంపెనీ విధుల్లో కొనసాగిస్తోందని బాధిత ఉద్యోగి ఒకరు వెల్లడించినట్టు ఓ వార్తా సంస్ధ తెలిపింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ వరకూ 860 మంది ఉద్యోగులను బ్రెయిన్లీ తొలగించిందని లింక్డిన్ పేర్కొంది. కస్టమర్ సపోర్ట్, ప్రోడక్ట్, మార్కెటింగ్, ట్యూటర్స్, ఇన్హౌస్ అకడమిక్ టీం, లీగల్, సాంకేతిక విభాగాల్లో లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి. ఇక ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ సైతం రెవెన్యూ పడిపోవడంతో పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే.