న్యూఢిల్లీ : సైబర్ క్రిమినల్స్ చెలరేగుతూ ఆన్లైన్లో అందినకాడికి దోచుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో సైబర్ నేరస్తులు అమాయకుల ఖాతాల్లో సొమ్మును లూటీ చేస్తున్నారు. ఆన్లైన్లో క్షణాల్లో డబ్బు మాయం చేస్తున్న కేటుగాళ్లు తమ లాంటి నైపుణ్యాలు కలిగిన వారిని తమ టీముల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫ్రెష్ టాలెంట్స్ను హైర్ చేసేందుకు సన్నద్ధమయ్యారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పర్స్కై పేర్కొంది. డార్క్ వెబ్లో ఈ తరహా ప్రకటనలు రెండు తమ కంటపడ్డాయని తెలిపింది.
ఇది ఫుల్టైమ్ జాబ్గా ప్రకటనలో వివరాలను బట్టి తెలిసిందని సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ తెలిపింది. ఇతర వ్యాపారాల తరహాలోనే సైబర్క్రైమ్ కూడా తన వ్యాపార వృద్ధికి మానవ నైపుణ్యాలు అవసరమని కాస్పర్స్కై బ్లాగ్ పేర్కొంది. కొవిడ్-19 ముమ్మర దశలో ఉన్న 2020 మార్చిలో ఈ తరహా జాబ్ యాడ్స్ డార్క్ వెబ్సైట్స్లో అధికంగా వచ్చాయని గుర్తించామని కాస్పర్స్కై తెలిపింది. పెద్దసంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోవడం, మరికొందరు ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఈ ప్రకటనలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది.
నగదు కొరతతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్న 2020లోనే సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఉద్యోగార్ధులను టార్గెట్ చేస్తూ వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టారు. డార్క్వెబ్ యజమానులు తమ హ్యాకర్ టీముల్లో పనిచేసేందుకు మాల్వేర్ కోడ్ను అభివృద్ధి చేసి విస్తరించేవారికి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించి మెయింటైన్ చేసే వారి కోసం గాలిస్తున్నాయని కాస్పర్స్కై బ్లాగ్లో పేర్కొంది. డార్క్ వెబ్లో మొత్తం జాబ్ పోస్టింగ్స్లో 61 శాతం డెవలపర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించినవేనని తెలిపింది. ఈ యాడ్స్కు సంబంధించి ఓ ప్రకటనలో డెవలపర్కు గరిష్టంగా నెలకు రూ. 16 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసినట్టు గుర్తించామని కాస్పర్స్కై వెల్లడించింది.