ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు చుక్కెదురైంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చట్టాలను ఉల్లంఘించింనందుకు ఫ్లిప్కార్ట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1.35 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఇది మన కరెన్సీలో సుమారు 10 వేల కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన నోటీసులను ఫ్లిప్కార్ట్ సంస్థకు, దాన్ని ఫౌండర్లకు ఈడీ పంపించింది. 1.35 బిలియన్ డాలర్ల ఫైన్ను మీరు ఎందుకు కట్టకూడదో వివరణ ఇచ్చుకోండి.. అంటూ ఈడీ నోటీసులో పేర్కొన్నది.
గత కొన్నేళ్ల నుంచి ఫ్లిప్కార్ట్తో పాటు మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు ఈడీ విచారణలో తేలింది. ఫారెన్ ఇన్వెస్టర్ డబ్ల్యూఎస్ రిటైల్ ద్వారా కస్టమర్లకు ఆ షాపింగ్ వెబ్ సైట్లో వస్తువులు అమ్మిందని.. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లా ప్రకారం అది నిషేధం అని ఈడీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ అయిన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్… ఇద్దరికీ చెన్నైలోని ఈడీ ఆఫీసు నుంచి షోకాజ్ నోటీసులను జులై నెలలో పంపించారు. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుత ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్కు కూడా నోటీసులను పంపించినట్లు ఈడీ వెల్లడించింది. అయితే.. ఈడీ నోటీసులపై స్పందించడానికి ఫ్లిప్కార్ట్కు ఈడీ 3 నెలల గడువు ఇచ్చింది.
ఫ్లిప్కార్ట్ ఏనాడూ భారత చట్టాలను అతిక్రమించలేదు. అయినప్పటికీ.. మేము అధికారులకు సహకరిస్తాం. 2009 నుంచి 2015 పీరియడ్కు సంబంధించి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లాను అతిక్రమించారంటూ నోటీసులు పంపించారు. అయినప్పటికీ.. మా తరుపు నుంచి అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాం.. అని ఫ్లిప్కార్ట్ ప్రతినిధి తెలిపారు.
అయితే.. ఈ నోటీసులపై బిన్నీ, సచిన్ బన్సల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. మరో ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్ మాత్రం ఆ నోటీసులను ఖండించారు.
2018లో ఫ్లిప్కార్ట్ మెజారిటీ షేర్లను వాల్మార్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామర్స్ చరిత్రలోనే అది అతి పెద్ద డీల్. సచిన్ బన్సల్ తన షేర్స్ను ఒకేసారి వాల్ మార్ట్కు అమ్మేశారు. బిన్ని బన్సల్ మాత్రం.. కొన్ని షేర్స్ను మాత్రమే అమ్మి.. మిగితావి తన వద్దే ఉంచుకున్నారు.