Elon Musk on Twitter | ట్విట్టర్ ఉద్యోగులకు ఆ సంస్థ నూతన యజమాని ఎలన్మస్క్ గట్టి హెచ్చరికలే చేశారు. మరింత ఆదాయం సమకూర్చుకోకపోతే సంస్థ దివాళా తీసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ట్విట్టర్ను టేకోవర్ చేసిన రెండు వారాల తర్వాత తొలిసారి సిబ్బందితో సమావేశమయ్యారు. కొన్ని వారాల పాటు 80 గంటల ఆటు పని చేయాలని, ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీకి స్వస్తి పలుకాలని, వర్క్ ఫ్రం హోం సంస్కృతి పూర్తిగా ఎత్తేయాలని నిర్ణయించారు మస్క్. ట్విట్టర్ను స్వాధీనం చేసుకోవడంతోనే సీఈవో పరాగ్ అగర్వాల్తోపాటు టాప్ ఎగ్జిక్యూటివ్లు, దాదాపు సగం మంది సిబ్బందికి ఉద్వాసన పలికారు. మరి కొందరు ఎగ్జిక్యూటివ్లు స్వచ్ఛందంగా వైదొలిగారు.
ఎలన్మస్క్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న లీడర్షిప్ టీం సభ్యుడు యోల్ రోత్ సైతం వైదొలిగినట్లు సమాచారం. ట్విట్టర్ విశ్వసనీయత, సేఫ్టీ సంబంధిత అంశాల పర్యవేక్షణ బాధ్యతను యోల్ రోత్ స్వీకరించారు. మరో ఎగ్జిక్యూటివ్ రాబిన్ వీలర్ కూడా రాజీనామా చేశారని వార్తలొచ్చాయి. రాబిన్ వీలర్ను కొనసాగాలని ఎలన్మస్క్ కోరినట్లు సమాచారం. సంస్థకు యాడ్స్ ఇస్తున్న సంస్థలతో రిలేషన్స్ మెరుగు పరిచే బాధ్యతలను రాబిన్ వీలర్ సూపర్వైజ్ చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీగా మారిన ట్విట్టర్ ఇప్పుడు దాదాపు 13 బిలియన్ల డాలర్ల రుణ ఊబిలో చిక్కుకుంది.
అందులో ఏడు వాల్స్ట్రీట్ బ్యాంకులు ఈ రుణ భారం నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నాయని తెలిసింది. ఈ బ్యాంకుల రుణాల స్థానే స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు సుముఖంగా లేరని సమాచారం. ట్విట్టర్ దివాళా దశలో ఉందని ప్రకటించక ముందు కూడా కొన్ని బ్యాంకులు ఇచ్చిన రుణంలో డాలర్కు 60 సెంట్లు మాత్రమే ఇస్తున్నట్లు వినికిడి. సాధారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలకు మాత్రమే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని బ్యాంకులు 70 సెంట్లకే స్టాక్స్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. అంటే 30 శాతం రుణాలు వదులుకునేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయన్న మాట.
వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎత్తేస్తే.. ఆఫీసులకు రావడానికి ఇష్టం లేనివారి రాజీనామాలను ఆమోదించేస్తాం అని ఎలన్మస్క్ అన్నట్లు తెలిసింది. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి సంస్థ పట్ల విశ్వాసం శరవేగంగా తుడిచిపెట్టుకుపోయింది. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలన్మస్క్ తీసుకున్న నిర్ణయాలపై విశ్లేషకులు, నిపుణులు, బ్యాంకర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే ట్విట్టర్కు యాడ్లు ఇస్తున్న సంస్థలు వెనుకడుగు వేశాయి. ఈ పరిస్థితుల్లో పలువురు ఎగ్జిక్యూటివ్లు సంస్థను వీడటం ఆందోళనకరమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ ఆదాయం పెంచడానికి బ్లూటిక్ వెరిఫికేషన్ సబ్స్క్రిప్షన్ పాలసీని వేగంగా ముందుకు తీసుకు వెళ్లాలని సిబ్బందిని ఎలన్మస్క్ కోరినట్లు సమాచారం.