టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొనుగోలు చేసిన తర్వాత భారీమార్పులు చోటుచేసుకుంటున్నాయి. జీతాల ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించే పనిలో ఉన్నాడు మస్క్. అంతేకాదు ప్రకటనలు, కొత్త సర్వీస్ల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాల్నికూడా అన్వేషిస్తున్నాడు. అందులో భాగంగానే యూజర్లకు పెయిడ్ సర్వీస్లు అందించబోతోంది ట్విట్టర్. అవేంటంటే..
పెయిడ్ వెరిఫికేషన్
ట్విట్టర్లో ప్రస్తుతం 4 లక్షలకుపైగా వెరిఫైడ్ అకౌంట్లు ఉన్నాయి. పెయిడ్ సర్వీస్ ఫీచర్ వస్తే యూజర్లు తమ పేరు పక్కన బ్లూ టిక్ కనిపించడం కోసం నెలకు ఎనిమిది డాలర్లు చెల్లించాలి. అయితే, ఈ ఫీచర్ నవంబర్ 7వ తారీఖు నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ముందుగా అందుబాటులోకి రానుంది. ఈ సర్వీస్ తీసుకున్నవాళ్లు అథెంటికేషన్ కోసం ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం లేదట.
పెయిడ్ మెసేజ్లు, వీడియోలు
పాపులర్ వ్యక్తులు, సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలకు ఈ ఫీచర్ వర్తించనుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు కొన్ని డాలర్లు చెల్లించి తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు డైరెక్ట్గా మెసేజ్లని పంపొచ్చు. యూజర్లు
కంటెంట్ క్రియేటర్స్ పోస్ట్ చేసిన వీడియోల్ని చూడాలంటే ఇకపై డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందులోంచి ట్విట్టర్కి కూడా ఆదాయం రానుంది.
వేలల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్ని కొనేందుకు బిడ్ వేశాడు ఎలాన్ మస్క్. చివరకు అక్టోబర్ 27వ తేదీన 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ని చేజిక్కించుకన్నాడు. ట్విట్టర్ని స్వేచ్ఛగా గొంతు వినిపించే వాళ్లకు అనువైన వేదికగా మారుస్తానని చెప్పాడు మస్క్. అంతేకాదు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ని, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ వంటి ముఖ్యమైన వాళ్లను తొలగించాడు. ఇప్పటికే చాలామందిని తొలగిస్తున్నట్టు ఇమెయిల్స్ పంపించింది ట్విట్టర్.