Musk View on Twitter | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళనకు గురవుతున్నారు. ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు టెస్లా సీఈవో ఎలన్మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎలన్మస్క్ ఆఫర్కు ట్విట్టర్ యాజమాన్యం ఆమోదం తెలిపినప్పటి నుంచి ఉద్యోగుల ఉద్వాసన గురించి, ట్విట్టర్ భవితవ్యం గురించి సీఈవో పరాగ్ అగర్వాల్పై ప్రశ్నల వర్షం కురుస్తున్నది.
ఇప్పటికిప్పుడైతే ఉద్యోగాల్లో కోత విధించడం జరుగదని సీఈవో పరాగ్ అగర్వాల్ హామీ ఇస్తున్నా.. ఒక వార్తా సంస్థలో భిన్నమైన కథనం ప్రచురితమైంది. కేవలం ఉద్యోగుల్లో కోత విధించడమే కాదు.. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్నే ఎలన్మస్క్ మార్చేయబోతున్నారని ఆ కథనం సారాంశం. ట్విట్టర్ను అధికారికంగా టేకోవర్ చేసుకోగానే దానికి కొత్త సీఈవో రానున్నారు. గత నెలలో ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్తో జరిగిన భేటీలోనూ ఎలన్మస్క్.. ప్రస్తుత మేనేజ్మెంట్ పట్ల విశ్వాసం లేదని, మొత్తం మేనేజ్మెంట్ స్థాయి నుంచి ప్రక్షాళన తప్పదని సంకేతాలిచ్చారని వినికిడి.
గతేడాది నవంబర్లో జాక్డోర్సీ స్థానంలో సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఎలన్మస్క్కు ట్విట్టర్ను అప్పగించే వరకు అగర్వాల్ సీఈవోగా కొనసాగుతారు. పరాగ్ అగర్వాల్ స్థానే నియమితులయ్యే సీఈవో పేరును బయట పెట్టడానికి ఎలన్మస్క్ నిరాకరించారని సమాచారం. ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన 12 నెలల్లోపు అగర్వాల్ను తొలగిస్తే ఆయనకు 43 మిలియన్ల డాలర్లు మస్క్ చెల్లించాల్సి ఉంటుందని వార్తలొచ్చాయి.
ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దెను కూడా తప్పించడానికి ఎలన్మస్క్ ప్రణాళిక సిద్ధం చేశారని న్యూయార్క్ పోస్ట్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఒకవేళ ఆమె తొలగిస్తే 12.5 మిలియన్ల డాలర్ల ప్యాకేజీతోపాటు కొన్ని ట్విట్టర్ షేర్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె వేతన ప్యాకేజీ 17 మిలియన్ డాలర్లు. ట్విట్టర్ నుంచి అత్యధిక వేతన ప్యాకేజీ పొందుతున్న ఎగ్జిక్యూటివ్ల్లో ఆమె ఒకరు. ఈ నేపథ్యంలో విజయగద్దె గతవారం తన సహచరులతో మాట్లాడుతూ ట్విట్టర్ భవితవ్యం, తమ ఉద్యోగ భద్రత గురించి బోరుమన్నారని సమాచారం.