న్యూయార్క్ : ట్విట్టర్ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్ తీరుతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెను తొలగించిన మస్క్ తాజాగా పలువురు ఉద్యోగులకు ఉద్వాసన పలకుతారనే ప్రచారం సాగుతోంది. ట్విట్టర్లో దాదాపు సగం మంది ఉద్యోగులను సాగనంపాలని మస్క్ యోచిస్తున్నారని బ్లూమ్బర్గ్ తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది.
ట్విట్టర్లో 3700 మంది ఉద్యోగులపై మస్క్ వేటు వేయనున్నారని ఈ నివేదిక బాంబు పేల్చింది. ఈ వారాంతంలోనే ఆయా ఉద్యోగులకు సమాచారం అందించనున్నారని పేర్కొంది. మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన అనంతరం లేఆఫ్స్ భారీగా ఉంటాయనే వార్తలను ట్విట్టర్ బాస్ తోసిపుచ్చినా ఆయన వచ్చీ రాగానే సీఈవో, పాలసీ హెడ్లను తొలగించడంతో జాబ్ కట్స్పై భయాందోళనలు నెలకొన్నాయి.
మరోవైపు వర్క్ ఫ్రం హోం నుంచి తిరిగి కార్యాలయాలకు రావాలని ట్విట్టర్ ఉద్యోగులను మస్క్ కోరనున్నారని చెబుతున్నారు. ఇక బ్లూటిక్ సహా ఇతర ప్రయోజనాలకు నెలకు 8 డాలర్లు చార్జ్ చేయాలన్న మస్క్ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తినా దీనిపై ట్విట్టర్ బాస్ వెనక్కితగ్గలేదు.