న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు కలిగిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి డేటా, ప్రైవసీ సమస్యలను ఎదుర్కొంటోంది. విశ్వవ్యాప్తంగా 50 కోట్ల వాట్సాప్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీకైందని, ఈ సమాచారాన్ని అజ్ఞాత విక్రేత ఒకరు హ్యాకింగ్ కమ్యూనిటీ వేదికపై అమ్మకానికి పెట్టారని సైబర్న్యూస్ రిపోర్ట్ బాంబు పేల్చింది.
పలు డేటా శాంపిల్స్ను పరిశీలించగా లీక్ వాస్తవమేనని నిగ్గుతేలిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ లీక్ భారత్, రష్యా, ఇటలీ, ఈజిప్ట్, బ్రెజిల్, స్పెయిన్ సహా 80 దేశాలపై ప్రభావం చూపనుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. లీక్ చేసిన వ్యక్తి అమెరికా డేటా సెట్ను 7000 డాలర్లకు, బ్రిటన్ డేటాసెట్ను 2500 డాలర్లకు, జర్మనీ డేటా 2000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్టు రిపోర్ట్ తెలిపింది. అయితే భారత్ సహా ఇతర దేశాల డేటాకు సంబంధించిన ధరలను రిపోర్ట్ వెల్లడించలేదు.
లక్షలాది యాక్టివ్ వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్లను హ్యాకర్ ఎలా సేకరించాడనేది స్పష్టం కాలేదు. ఈ వ్యవహారంలో వాట్సాప్ తప్పిదం లేదని, స్ర్కాపింగ్ అనే ప్రక్రియ ద్వారా హ్యాకర్ డేటా చౌర్యానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ కేసులో హ్యాకర్ సైబర్ దాడికి పాల్పడేందుకు బదులుగా వివిధ వెబ్సైట్ల నుంచి డేటాను సమీకరించినట్టుగా తెలుస్తోంది. వెబ్ పేజీల నుంచి ఫోన్ నెంబర్లను హ్యాకర్ సేకరించినట్టు చెబుతున్నారు. లీకయిన డేటాను హ్యాకర్లు స్పామింగ్, ఫిషింగ్ అటెంప్ట్స్, ఐడింటిటీ థెఫ్ట్, సహా ఇతర సైబర్ నేర కార్యకలాపాలకు వాడే అవకాశం ఉంది.