ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం
Today History: వస్తువు మీద కాంతి కిరణం పడినప్పుడు అది పరావర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 లో సరిగ్గా ఇదే రోజున వెల్లడించారు. ఆయన రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన రోజునే మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటున్నాం. సైన్స్ రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి.. ప్రపంచ వినువీధిలో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించారు. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతగా చూపించారు. అరకొర పరికరాలతోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెంది నీరు నీలిరంగులో కనిపిస్తుందని కూడా లోకానికి వెల్లడించారు.
తమిళనాడులోని తిరుచురాపల్లిలో 1888 నవంబర్ 7న చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్కు చంద్రశేఖర్ వెంకట రామన్ జన్మించారు. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది. రామన్ తన 13 వ ఏట 1902 లో ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి.. 1904 లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందారు. 1907 లో ఇదే కళాశాల నుంచి ఎంఏ డిగ్రీని ఫిజిక్స్లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ చేరారు.
ఒకసారి కలకత్తాలో ప్రయాణిస్తుండగా బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డును చూసిన సీవీ రామన్.. పరుగు పరుగున అక్కడికి వెళ్లి ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసారు. తనకు పరిశోధన చేసేందుకు అనుమతినించాలని కోరి సాధించారు. అక్కడి నుంచి ఆయన పరిశోధనా ప్రస్థానం మొదలైంది. వారాంతపు సెలవులు, పండగల సమయాల్లో పరిశోధనలతో కాలం గడిపేవారు. తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించారంటే.. రామన్కు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోచ్చు.
సీవీ రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్కు 1930 లో ఆయనకు నోబెల్ బహుమతిని సాధించిపెట్టింది. నోబెల్ పొందిన రెండో భారతీయుడిగా నిలిచిన రామన్ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1928 లో రామన్కు సర్ బిరుదు దక్కగా.. 1947 లో ప్రతిష్ఠాత్మక ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది. 1954 లో భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించింది. 1957 లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’ని బహూకరించింది. విదేశాలలో ఎన్నో అవకాశాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి సీవీ రామన్ ఎన్నో విజయాలు సాధించిన భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలిచారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ అరుదైన వ్యాధుల రోజు