బీజింగ్: ఇప్పటికే ప్రపంచంలో అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. అంతరిక్షంలోనూ ఆ దేశాన్ని సవాలు చేస్తోంది. అరుణ గ్రహంపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంతోపాటు అక్కడి వనరులను వెలికి తీయడానికి దీర్ఘకాల ప్రణాళికను రూపొందించింది. ఈ మధ్యే మార్స్పై తన తొలి రోవర్ను ల్యాండ్ చేయడంలో విజయవంతమైన చైనా.. 2033లో ఏకంగా మనుషులను అరుణ గ్రహంపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత నుంచి రెండేళ్లకోసారి ఇలా మనుషులను మార్స్పైకి పంపిస్తామని చెబుతోంది.
తొలిసారి తన మార్స్ ప్లాన్ను చైనా ప్రపంచం ముందు ఉంచింది. చైనాకు రాకెట్ తయారు చేసే ప్రధాన సంస్థ చీఫ్ వాంగ్ షియావ్జున్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి రష్యాలో జరిగిన కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 2033, 2035, 2037, 2041లలో మార్స్పైకి చైనా మనుషులను పంపనున్నట్లు వాంగ్ తెలిపారు.
మనుషుల కంటే ముందు రోబోలు
మార్స్పైకి మనుషులను పంపించే ముందు చైనా రోబోలను పంపనున్నట్లు వాంగ్ చెప్పారు. బేస్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలను గుర్తించడానికి, అక్కడి వనరులను వెలికి తీయడానికి ఈ రోబోలను పంపిస్తామని తెలిపారు. మార్స్పై మనుషులు మనుగడ సాగించాలంటే ముందు అక్కడి వనరులను ఉపయోగించుకోగలగాలి. ఉపరితలం కింద ఉన్న నీటిని వెలికి తీయడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం, విద్యుత్ ఉత్పత్తి చేయడం జరగాలి.
అంతేకాదు మార్స్పైకి వెళ్లిన ఆస్ట్రోనాట్లను తిరిగి సేఫ్గా భూమిపైకి తీసుకురాగలిగే టెక్నాలజీని కూడా చైనా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మార్స్పైకి వెళ్లి అక్కడి మట్టి నమూనాలను సేకరించి తిరిగి భూమి మీదికి వచ్చే మానవ రహిత మిషన్ 2030లోగా పూర్తి చేయాలని చైనా భావిస్తోంది. 2030ల్లోనే అమెరికా కూడా మనుషులను మార్స్పైకి తీసుకెళ్లి, తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రయాణ సమయం తగ్గించే ప్రయత్నం
ప్రస్తుతం మార్స్పైకి ఓ స్పేస్క్రాఫ్ట్ వెళ్లడానికి కనీసం 9 నెలల సమయం పడుతోంది. అయితే చైనా మాత్రం రెగ్యులర్గా మార్స్కి, భూమికి స్పేస్క్రాఫ్ట్లను నడపాలని భావిస్తుండటంతో ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించాలని చూస్తోంది. దీనికోసం న్యూక్లియర్ రియాక్షన్ల నుంచి వేడి, విద్యుత్ రూపంలో విడుదలయ్యే ఎనర్జీని స్పేస్క్రాఫ్ట్ వాడుకోవాల్సి ఉంటుందని వాంగ్ చెప్పారు. కొన్ని వందల రోజుల్లోనే మార్స్పైకి ఒక రౌండ్ ట్రిప్ పూర్తి చేయాలని తాము భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.