Today History: మానవ పరిణామం ఇలా ఉన్నదంటూ ప్రపంచానికి చాటిచెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ 1809 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. కొడుకును వైద్యుడిగా చేయాలని తండ్రి తపించగా.. కొడుకేమో చెట్లు, పుట్టలు పట్టుకుతిరిగేవాడు. దాంతో వీడు మన కుటుంబం పరువు తీయడం ఖాయమని నిత్యం కొడుకు డార్విన్పై తండ్రి మండిపడేవాడు. చివరకు మానవాళి పుట్టుక పరిణామం ఎలా
జరిగిందో తెలియజెప్పే సిద్ధాంతాన్ని మన ముందుంచి.. కోతుల నుంచే మనిషి వచ్చాడని చాటారు.
చార్లెస్ డార్విన్ తండ్రి రాబర్ట్ డార్విన్, తల్లి సుసాన్ డార్విన్ ఇద్దరూ ప్రసిద్ధ వైద్యులు. దాంతో కొడుకును కూడా డాక్టర్ చేయాలని ఎన్నో కలలు కన్నారు. అతని తండ్రి ఎంత ప్రయత్నించినప్పటికీ, చార్లెస్ చదువుపై ఆసక్తి చూపలేదు. ‘ఎలుకలను వేటాడడం, పట్టుకోవడం తప్ప మరో పట్టింపు లేదు. ఇలా చేయడం వల్ల నీకు నీవే కాకుండా మొత్తం కుటుంబం పరువు తీస్తావు’ అని ఒకరోజు చార్లెస్పై కోపం వ్యక్తం చేశారు. అయితే, ఇవేమీ పట్టించుకోని చార్లెస్ భూమిపై జీవం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు.
చార్లెస్కు 22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు 1831 డిసెంబరులో బీగల్ అనే ఓడ ద్వారా సూదూరంలోని ఓ ప్రాంతానికి వెళ్లాడు. దారిలో ఓడ ఎక్కడ ఆగినా చార్లెస్ దిగి జంతువులు, మొక్కలు, రాళ్లు, కీటకాలను చూస్తూ.. వాటి నమూనాలను సేకరించడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలు ఇలా పనిచేసిన తర్వాత భూమిపై ఉన్న అన్ని జాతులు ప్రాథమికంగా ఒక జాతికి మూలం అని చెప్పాడు.
24 నవంబర్ 1859 న చార్లెస్ డార్విన్ ‘ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో ‘థియరీ ఆఫ్ ఎవల్యూషన్’ అనే అధ్యాయం కూడా ఉన్నది. కోతి నుంచి మనం ఎలా మనుషులుగా మారమో వెల్లడించారు. మన పూర్వీకులు కోతులు అని, కానీ కొన్ని కోతులు వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా జీవించడం ప్రారంభించడం వల్ల అవి క్రమంగా అవసరాలకు
అనుగుణంగా మారడం ప్రారంభించాయి. వాటిలో వచ్చిన మార్పులే మనల్ని ఈ విధంగా నిలబెట్టాయని పేర్కొన్నారు. అయితే ఈ మార్పు ఒకటి, రెండేండ్లలలో రాలేదు. కోటి సంవత్సరాలు పట్టింది. ఈ సిద్ధాంతం కారణంగా చార్లెస్ డార్విన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. ఒకప్పుడు తన కొడుకు కుటుంబం మొత్తానికి చెడ్డపేరు తెస్తాడని చెప్పుకునే తండ్రి.. అనంతర కాలంలో కొడుకు కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
పొందాడు.