5G Coming Soon | ఎట్టకేలకు 5జీ సేవలు భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూలైలో స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. 20 ఏండ్ల వ్యాలిడిటీ కలిగిన ఈ స్పెక్ట్రమ్ను దక్కించుకునేందుకు టెలికం సంస్థలతో పాటు అమెజాన్, టీసీఎస్, ఎల్అండ్ టీ వంటి ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ కూడా బిడ్డింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలేంటి? సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయనే అంశాలు ఒకసారి చూద్దాం..
5జీ.. అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. పైగా రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ‘నెట్వర్క్ స్లైసింగ్’ అనే ప్రక్రియ ద్వారా సిమ్కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి.
– సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకునే వేగం సెకనుకు పది గిగాబైట్ల వరకూ ఉంటుంది. ఇది 4జీ కంటే దాదాపు వందరెట్లు ఎక్కువ.
– 5జీ అవసరాన్నిబట్టి రకరకాల తరంగాలను వినియోగించుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫోన్తో జోడించిన వస్తువులు పని చేసేటప్పుడు మరోలా. ఇలా వేర్వేరు పనులను ఒకేసారి సమర్థంగా చేయగలుగుతుంది.
– ఈ ఫోన్లలో బ్యాటరీ వినియోగం తగ్గే అవకాశం ఉన్నది. సిగ్నల్స్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, సమాచారాన్ని అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం, స్పందనకోసం ఎక్కువ సమయం వృథా చేయక పోవడం.. లాంటి చర్యలతో బ్యాటరీ జీవితకాలం పెరుగవచ్చని అంచనా.
– సమాచారం వెళ్లడానికీ, తిరిగి జవాబు రావడానికీ మధ్య ఉండే సమయాన్ని ‘లేటెన్సీ’ అని పిలుస్తారు. 4జీలో ఈ సమయం 250 మిల్లీసెకండ్ల వరకూ ఉంటే, 5జీలో మాత్రం కేవలం 1 మిల్లీసెకను మాత్రమే. అంటే, కన్నుమూసి తెరిచేలోగా మన ఆదేశాలు అమలవుతాయన్నమాట.
– 5జీలోని తరంగాల సామర్థ్యం వల్ల సిగ్నల్ సరిగా లేకపోవడం, మధ్యలోనే కాల్స్ కట్ కావడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఈ సాంకేతికత ఎంతటి ట్రాఫిక్ను అయినా తట్టుకుంటుంది. దాంతో ‘న్యూ ఇయర్’ రోజు కూడా ‘నెట్వర్క్ బిజీ’ అనే మాట వినిపించదు.
ఒకానొక అంచనా ప్రకారం 5జీ అందుబాటులోకి రాగానే దాన్ని అందుపుచ్చుకునేందుకు 67 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. మరి, ధరలు అందుకు అనుమతిస్తాయా? 4జీతో పోల్చుకుంటే 5జీ సేవలు కచ్చితంగా ఖరీదే! అయితే, పారిశ్రామిక వర్గాలనుంచి ఎక్కువ వసూలు చేస్తే సాధారణ వినియోగదారుల భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కూడా 4జీ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తున్నాయి. పైగా, మారుతున్న సాంకేతికత వల్ల 4జీ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.
5జీ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. యూరప్తోపాటు మన సమీపంలోని థాయ్లాండ్, సింగపూర్ దేశాల్లోనూ దాని ఉనికి కనిపిస్తున్నది. కానీ, మన దేశంలో 5జీ ప్రయాణం మందకొడిగా సాగుతూ వచ్చింది. దీనికి కారణాలేంటి? అంటే, చాలా జవాబులే వినిపిస్తాయి. 5జీకి అనుగుణంగా మరిన్ని సెల్టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఆ డేటా వేగాన్ని తట్టుకునేందుకు పాత రాగి వైర్లకు బదులుగా పూర్తిగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వాడాల్సి ఉంటుంది. ఈ మౌలికమైన మార్పుల కోసమూ కొంత సమయం పడుతుంది. ఇది కాకుండా కొవిడ్ వల్ల స్పెక్ట్రమ్ వేలం ఆలస్యం కావడం ఓ ముఖ్యకారణం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమతినిచ్చింది. దీంతో భారత్లో కూడా 5జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.