న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 18,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించడంతో టెక్ ప్రపంచంలో కలకలం రేగింది. మరో వైపు భారత్లో పలు విభాగాలకు చెందిన వేయి మందిపై వేటు వేయడంతో పాటు అంతర్జాతీయంగా లేఆఫ్స్ కసరత్తును అమెజాన్ వేగవంతం చేసింది.
లేఆఫ్స్ ప్రకటన చేసే క్రమంలో బాధిత ఉద్యోగులకు పరిహారం, ఆరోగ్య ప్రయోజనాలు, అవసరమైన సాయం అందిస్తామని కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ప్రకటించారు. లేఆఫ్స్కు గురైన ఉద్యోగులకు పరిహారంగా ఐదు నెలల వేతనం అందచేస్తామని వెల్లడించారు. ఇక వేటుకు గురైన ఉద్యోగులందరి పరిహార ప్యాకేజ్ల విలువ ఏకంగా రూ. 5200 కోట్లుగా ఉంటుందని తేలింది.
పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసిన అమెజాన్ తాజాగా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తన కార్యాలయాల్లో కొన్నింటిని విక్రయించేందుకు సిద్ధమైంది. 16 నెలల కింటదట కాలిఫోర్నియాలో కొనుగోలు చేసిన కార్యాలయాన్ని అమెజాన్ విక్రయిస్తోందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో అమెజాన్ మాస్ లేఆఫ్స్కు పూనుకోగా యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్ వంటి పలు టెక్ దిగ్గజాలు సైతం పెద్దసంఖ్యలో ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించాయి.