Rare Green Comet: వినువీధిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. సూర్యుడిలాంటి లక్షలాది నక్షత్రాలు, చంద్రుడు, తోక చుక్కలు, ఇతర గ్రహాలు ఇలా అద్భుతాలెన్నో ఆకాశంలో దర్శనమిస్తుంటాయి. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి అద్భుతమే జరుగబోతున్నది. వచ్చే నెల 2న అత్యంత అరుదైన ఆకుపచ్చ తోకచుక్క ఒకటి భూమికి చేరువగా రాబోతున్నది. ఆరోజు అది భూమికి కేవలం 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఆ తోకచుక్క తిరిగే కక్ష్యలో భూమికి అత్యంత సమీప బిందువు అదేనని శాస్త్రవేత్తలు తెలిపారు.
సూర్యుడి బాహ్యకక్ష్యలో పరిభ్రమించే ఈ ఆకుపచ్చ తోకచుక్క సూర్యుడి చుట్టూ ఒకసారి చుట్టి రావడానికి 50 వేల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది భూమికైనా, సూర్యుడికైనా 50 వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేరువగా వస్తుంది. సూర్యుడి సమీపంగా వచ్చినప్పుడే, భూమికి కూడా సమీపం నుంచి వెళ్తుంది. జనవరి 12న సూర్యుడికి సమీపంలోకి రాగా, వచ్చే ఫిబ్రవరి 2న భూమి సమీపంలోకి రాబోతున్నది. ఆరోజు పగలు అయితే బైనాక్యులర్ల సాయంతో, రాత్రిపూట అయితే ఏ పరికరాన్ని ఉపయోగించకుండానే ఈ తోకచుక్కను వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2022 మార్చిలో కనిపెట్టిన శాస్త్రవేత్తలు
ఈ అరుదైన ఆకుపచ్చ తోకచుక్క భూమిని సమీపిస్తున్నట్లు 2022 మార్చిలోనే జూపిటర్ సమీపంలో ఉండగా అమెరికా అంతరిక్ష శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి నాసా C/2022 E3 (ZTM) అని పేరు పెట్టారు. ఇది గతంలో 50,000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ మానవుల కాలంలో భూమికి దగ్గరగా వచ్చిందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ తోకచుక్క తిరిగే కక్ష్యలో సూర్యుడి సమీప బిందువు 1.4 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నదని, జనవరి 12న గ్రీన్ కామెట్ ఆ బిందువును దాటేసిందని తెలిపారు.
మంచుపదార్థం మండటంవల్లే తోక
కాగా, ఈ తోకచుక్క సూర్యుడికి సమీపానికి వచ్చినప్పుడు దానిలోని పదార్థస్వభావంవల్ల సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. భూమికి సమీపంలోకి రాగానే ఈ ఆకుపచ్చ తోకచుక్కలోని హిమపదార్థం మండటంవల్ల దాని వెనుకలో తెల్లని రంగులో పొడవైన తోక ఏర్పడుతుందని తెలిపారు. మరి ఫిబ్రవరి 2న ఈ తోకచుక్కను వీక్షించే అరుదైన అవకాశాన్ని వదులుకోకండి. ఇప్పుడు మిస్సైతే మళ్లీ 50 వేల ఏండ్ల తర్వాతనే ఈ గ్రీన్ కామెంట్ దర్శనమిచ్చేది.