దిస్పూర్ : రెండు రోజులుగా వరుస భూకంపాలతో ఈశాన్య రాష్ట్ర అసోం చిరుగుటాకులా వణికిపోతోంది. బుధవారం రాత్రి వరకు సుమారు 13 సార్లు భూమి కంపించింది. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్పూర్లో ఆరుసార్లు భూకంపాలు నమోదయ్యాయి. స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. మొదట అర్ధరాత్రి 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్పూర్కు 18 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఆ తర్వాత 1.10 గంటలకు 2.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మళ్లీ 1.10 గంటలకు, ఆ తర్వాత 1.20 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.6 మాగ్నిట్యూడ్తో భూమి కంపించి. 1.41 గంటలకు మరోసారి 2.3, అనంతరం 1.52 గంటలకు 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రికార్డయ్యాయి. చివరి సారిగా 2.38 గంటలకు 2.7 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. మరోసారి వరుసగా భూకంపాలు రావడంతో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు రోజులుగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
బుధవారం ఉదయం సంభవించిన భూకంపాలకు పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకంపనల సమయంలో వేర్వేరుచోట్ల ఒకరు షాక్తో, మరొకరు గుండెపోటుతో మరణించారు. నాలుగు జిల్లాల్లో 10 మంది గాయపడ్డారు. సోనిత్పూర్ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్పూర్లో బుధవారం ఉదయం 7.51 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.4గా నమోదవగా.. పశ్చిమ బెంగాల్, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.
ఆ తర్వాత మరోసారి 12 సార్లు స్వల్ప తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సర్బానంద సోనోవాల్కు ఫోన్ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం తరఫున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.