వికారాబాద్, మార్చి 13 : జిల్లాలో ఎన్నికల నియమ నిబంధనలు అమలులో ఉన్నందున వాల్ రైటింగ్, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్లాగ్లను మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధుల్లో ఫీల్డ్ సిబ్బందిచే తొలగించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో పురోగతి బాగుందని, అన్ని మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఈ నెల 20 వరకు పూర్తి చేయాలన్నారు. పూర్తయిన వాటికి ఎఫ్టీవో జనరేట్ చేయాలన్నారు. బొంరాస్పేట్, తాండూరు, బషీరాబాద్, కొడంగల్ మండలాలవారీగా ఇప్పటివరకు ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఎన్ని పనులు చేయాల్సి ఉంది, ఇంకా చేయాల్సినవి ఎన్నో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ బిల్డింగ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, అనుకున్న అంచనాల మేరకు పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఆర్డీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు డీఈలు, ఈఈలు, అధికారులున్నారు.