వికారాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్వోఎఫ్వో చట్టం ప్రకారం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. వాటి ప్రకారం వికారాబాద్ జిల్లాలోని అధికారులు పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. కాగా అధికారులు ఇప్పటికే పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు.. దరఖాస్తుల వారీగా క్షేత్ర స్థాయిలో విచారణను కూడా ప్రారంభించారు. క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా సంబంధిత పోడుదారులు ఎప్పటి నుంచి ఎన్ని ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. కాగా సోమవారం నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు పోడు భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల గ్రామాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. ఈ దరఖాస్తుల విచారణ కోసం గ్రామస్థాయి మొదలుకొని డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి, అటవీశాఖ బీట్ అధికారి, సర్వేయర్, తహసీల్దార్.. డివిజన్ స్థాయి కమిటీకి చైర్మన్గా ఆర్డీవో, సభ్యులుగా డీఎఫ్వో, డీజీటీవో, ఇద్దరు గిరిజన జడ్పీటీసీలు ఉంటారు.. అందేవిధంగా జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్గా కలెక్టర్.. సభ్యులుగా జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి తదితరులుంటారు. గ్రామస్థాయి కమిటీ విచారించిన తర్వాత డివిజన్ స్థాయి కమిటీకి అర్హుల దరఖాస్తులను అందజేస్తారు. అక్కడ ఆర్డీవో ఆధ్వర్యంలోని డివిజన్ స్థాయి కమిటీ మరోసారి విచారించి.. అనంతరం జిల్లా స్థాయి కమిటీకి అర్హుల జాబితాను అందజేస్తుంది. తుది జాబితాకు జిల్లా కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపి, సంబంధిత పోడుదారుల జాబితాను ప్రభుత్వానికి అందించనున్నది.
21,761 ఎకరాలు..
జిల్లాలోని 111 గ్రామ పంచాయతీలు 128 హ్యాబిటేషన్లల్లో ఉన్న 21,761 ఎకరాల్లోని పోడు భూ ములను గిరిజనులు 10,635 ఎకరాలను .. ఇతరులు 11,126 ఎకరాలను సాగు చేసుకుంటున్నా రు. కాగా ఇప్పటివరకు 9,647 మంది రైతులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
జిల్లాలో ధారూరు, యాలాల, కుల్కచర్ల, బషీరాబాద్, దుద్యాల మండలాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న రైతులు ఎన్ని ఎకరాలను, ఎన్ని ఏండ్ల నుంచి సాగు చేస్తున్నారనే వివరాలు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడి కానున్నది. దాని ప్రకారం నిజమైన పోడుదారులకు పట్టాలివ్వనున్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు మూడు తరాలుగా అటవీ భూములను దున్నుకుంటున్న గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పట్టాలను అందజేయనున్నారు.
సర్వే ప్రారంభమైంది
పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. అర్హులను గుర్తించే క్షేత్రస్థాయి సర్వే జిల్లాలో ప్రారంభమైనది. వచ్చే నెల పదో తేదీలోగా సర్వేను పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేస్తాం. అర్హులకే ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకా రం పట్టాలిస్తాం. దరఖాస్తులను విచారించేందుకు ఇప్పటికే గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశాం.
– నిఖిల, వికారాబాద్ కలెక్టర్