వికారాబాద్ : అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందజేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ పునాది మీ చేతుల్లోనే ఉందని, వారికీ మంచి విలువలతో కూడిన విద్యను అందించి బావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కరోనా నిబందనలు పాటిస్తూ జాగ్రత్తలు వహించాలని సూచించారు.
పిల్లలకు అందుబాటులో ఉండి ఆటపాటలతో చదువు చెప్పించాలని వివరించారు. బాలింతలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులను తయారు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదిని, ధారూరు జడ్పీటీసీ సుజాత, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.