వికారాబాద్, జూలై 21, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, చెక్డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. దీంతో భూగర్భ జలాలు సైతం వృద్ధి చెంది యాసంగి పంటలకు కూడా ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. వర్షాకాలం ఆరంభంలోనే చెక్ డ్యాంలు నిండుకుండలను తలపిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ ఇరిగేషన్ శాఖకు 1196 చెరువులు, కుంటలున్నాయి. వీటి పరిధిలో 78వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. జిల్లాలో ప్రస్తుతం 66 చెరువులు అలుగు పారుతున్నాయి. 155 చెరువులు పూర్తిగా నిండిపోయాయి.
చెక్ డ్యాంలలోకి భారీగా వరద నీరు
జిల్లాలోని చెక్ డ్యాంలు భారీ వర్షాలకు నిండుతున్నాయి. అనేక చోట్ల అలుగు పారుతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే చెక్ డ్యాంలు నిండి నీరు ఈసీ-మూసీ నదులతో ఇతర ప్రాంతాలకు ప్రవహిస్తుంది. కానీ ఈసారి జూన్ ఆరంభం నుంచే వర్షాలు బాగా పడడంతో జిల్లాలోని ప్రధాన వాగులో ప్రవాహం ఉరకలేసింది. కాగ్నా, కాక్రవేణి, జుంటుపల్లి, లక్నాపూర్ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మరికొన్ని చోట్ల నిర్మించిన చెక్ డ్యాంలు నిండిపోయాయి.
ప్రాజెక్టుల్లోకి వరదనీరు
వికారాబాద్ నియోజకవర్గంలో కోట్పల్లి, సర్పన్పల్లి, శివసాగర్, కొంపల్లి చెరువు, నందివాగు, పరిగి నియోజకవర్గంలో లక్నాపూర్, కులకచర్ల మండలంలో అంతారం చెరువు, కొడంగల్ నియోజకవర్గంలో బొంరాస్పేట కాక్రవేణి, కొడంగల్ పెద్ద చెరువు, హస్నాబాద్ చెరువు, పెద్ద నందిగామ చెరువు, తాండూర్ నియోజకవర్గంలో కాగ్నా నది, కాక్రవేణి నది, యాలాల మండలం జుంటుపల్లి, శివసాగర్, శ్రీంరానగర్ ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాగ్నా, కాక్రవేణి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు అనంతగిరి కొండల నుంచి మొదలవుతాయి. అలాగే అనంతగిరి కొండల నుంచి పుట్టిన మూసీ వాగు, పరిగి మండలం సయ్యద్పల్లి నుంచి, పూడూరు మండలం దామగుండం అడవుల నుంచి మూసీ-ఈసీ వాగు వరద ఉధృతంగా పారుతున్నాయి. ఈ వాగులకు సమీపంలోని గ్రామాల వద్ద చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల నీరు నిలువ ఉండి భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావించింది. జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల పొడవునా ఈ వాగులు విస్తరించి ఉన్నాయి. కాగ్నా, కాక్రవేణి వరద నీరు కర్ణాటక రాష్ట్రంలోకి పోతుంది. (తాండూరు మండలం నారాయణపూర్ సమీపంలోని కాగ్నా నదిలోకి వరద నీరు చేరడంతో పరవళ్లు తొక్కింది. గ్రామ శివారులో ఇటీవల నిర్మించిన బ్యారేజీ కం చెక్ డ్యాం పైనుంచి నీరు పారింది) మూసీ వరద నీరు గండిపేటలోకి, ఈసీ వరద హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తాయి. ఇలా నీరు వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. అయితే నీటి ప్రవాహం ఉండడంతో ఈసారి ఇరువైపులా లక్ష ఎకరాలకు సాగునీరు అందడానికి అవకాశం ఉంది. ఆయా చెరువుల కింద 80వేల ఎకరాలు సాగు అంచనా వేస్తున్నారు.
అలుగు పారుతున్నవి ఇవే..
కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, అల్లాపూర్, నందివాగు, కాక్రవేణి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. కొంశెట్టిపల్లి, శివసాగర్, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగు పోస్తున్నాయి. భారీ వర్షాలు ఇలాగే కురిస్తే అడుగు దూరంలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు కూడా అలుగు పోసే అవకాశం ఉంది.
పూర్తిగా నిండిన 155 చెరువులు
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూలైలోనే చాలా చెరువులు నిండిపోయాయి. జిల్లావ్యాప్తంగా 1196 చెరువులుండగా అలుగు పారిన చెరువులు 66, వంద శాతం నిండిన చెరువులు 66, 75-100 శాతం నిండిన చెరువులు 155, 50-75 శాతం నిండిన చెరువులు 152, 25-50 శాతం నిండిన చెరువులు 288, 25శాతం నిండిన చెరువులు 535 ఉన్నాయి. 1196 చెరువుల పరిధిలో ఒక్కోదాని కింద వంద ఎకరాల పంటల సాగు కొనసాగుతుంది. చాలా చెరువులు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవన్గి, నవాంద్గి, ఇందర్చెడ్ గ్రామాల్లో ఎత్తిపోతల పథకం అభివృద్ధి పనులు చేశారు. రెండింటికి కలిపి రూ.2కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటి ద్వారా ‘ఎత్తిపోతల పథకాల’ బావి నిర్మాణాలు చేశారు. వీటి ద్వారా చెరువులు నింపుకునే అవకాశం ఉంది. దాదాపు 1200 ఎకరాల్లో సాగుకు అవకాశం ఉంటుంది. వీటిని మరింతగా పునరుద్ధరణ చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
చెరువులకు జల కళ
తాండూరు రూరల్, జూలై 21 : వారం రోజుల నుంచి కురుస్తున్న వానలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. తాండూరు మండలంలో 43 చెరువులు, కుంటలు ఉన్నాయి. నారాయణపూర్ గ్రామ సమీపంలో కాగ్నా వాగులో నిర్మించిన చెక్ డ్యాం పైనుంచి వరద నీరు దుంకుతోంది. మండల పరిధిలోని జినుగుర్తి శ్రీరాములవారి ప్రాజెక్టు, అల్లాపూర్ ప్రాజెక్టులోకి వర్షం నీరు చేరింది. ఆయకట్టు కింద ఉన్న రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండల పరిధిలోని చెన్గేష్పూర్ గండిచెరువు, గౌతాపూర్లోని మల్లన్నకుంట, చెంగోల్లోని పెద్ద చెరువులోకి వర్షం నీరు వచ్చి చేరింది. నారాయణపూర్, వీర్శెట్టిపల్లి గ్రామ సమీపంలోని కాగ్నా వాగులపై నిర్మించి చెక్డ్యాంల పైనుంచి వరద నీరు పారుతోంది. రాంపూర్ గ్రామ సమీపంలోని చెరువులోకి కూడా వరద నీరు వచ్చి చేరింది.
భారీగా వరద నీరు : సుందర్, నీటి పారుదల శాఖ, ఈఈ, వికారాబాద్ జిల్లా
జిల్లాలో జూలై నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. జిల్లాలో 1196 చెరువులు ఉన్నాయి. ఇందులో 50 శాతానికి పైగా చెరువులు నిండాయి. 66 చెరువులు అలుగు పోస్తున్నాయి. ఈ వర్షాలు ఇలానే ఉంటే చెరువులన్నీ పూర్తిస్థాయి నీటి మట్టం దాటే అవకాశం ఉంది. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి, యాలాల డివిజన్ల పరధిలో 1196 చెరువులు ఉన్నాయి.