వికారాబాద్, డిసెంబర్ 9: మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి పది రోజు ల్లో పూర్తి చేయాలని వికారా బాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ‘మన ఊరు- మన బడి ’ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాహుల్శర్మ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడు తలో మండలానికి రెండు పాఠశాలల చొప్పున 19 మండలాలకు మంజూరైన 38 మోడల్ పాఠశాలలను పది రోజుల్లో అన్ని హంగులతో సిద్ధం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన ప్రహరీలు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు ఇతర పనులన్నింటినీ పూర్తి చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, చేపట్టిన పనులకు వెంటనే ఎఫ్టీవోలు అప్లోడ్ చేయాలని సూచించారు.
డబుల్ బెడ్ రూమ్ పనులను వేగవంతం చేయాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పురోగతిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, నీటి వసతి వంటి మౌలిక వసతులతో జనవరి పదో తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.