ధారూరు : కారు అదుపుతప్పి బొల్తాపడి హోంగార్డు మృతి చెందగా, అతని భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలైన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన కావలి సురేశ్(40) అతని భార్య రేణుక పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. సురేష్ హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో హోంగార్డు (1588)గా పని చేస్తుండగా, భార్య రేణుక మైలార్దేవరపల్లి పోలీసు స్టేషన్లో(11207) కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అశ్విత్, యశ్వంత్ ఉన్నారు. గురువారం రోజు సురేష్ అన్న కూతురు వివాహానికి తాండూరుకు తన సొంత కారు (టీఎస్ 34ఈ8385)లో వేళుతున్నారు.
ధారూరు మండల పరిధిలోని గట్టేపల్లి గేటు సమీపంలోని మలుపు వద్ద కారు అదుపుతప్పి బొల్తాపడింది. కారులో ఉన్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ భార్యకు తీవ్రగాయాలు కాగా, ఇద్దరి పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ధారూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ధారూరు పోలీసులు తెలిపారు.