భవననిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటీఎస్ బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్) పకడ్బందీగా అమలవుతున్నది. వికారాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపా లిటీల్లోని ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలందుతున్నాయి. 2020 జూన్ నుంచి అమల్లోకి వచ్చిన టీఎస్- బీపాస్ ద్వారా వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీల నుంచి గత రెండేండ్ల కాలం లో 2,501 భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 1,825 దరఖాస్తులకు అధికారులు అనుమతులను మంజూ రు చేశారు. అందులో అత్యధికంగా వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి 1,168 దరఖాస్తులకు గాను 727 అనుమతులు మంజూరు కాగా.. తాండూరు మున్సిపాలిటీలో 670 దరఖాస్తులకు 650, కొడంగల్ మున్సిపాలిటీలో 158 దరఖాస్తులకు 91, పరిగి మున్సిపాలిటీలో 505 దరఖాస్తులకు 357 అనుమతులను మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. టీఎస్-బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరు అవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వికారాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్-బీపాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆదా చేసే సదుద్దేశంతోనే టీఎస్ బీ-పాస్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. రాష్ట్రంలోనే వికారాబాద్ మున్సిపాలిటీతోపాటు మహబూబ్నగర్ మున్సిపాలిటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి విజయవంతం కావడంతో అన్ని మున్సిపాలిటీల్లోనూ అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో అనుమతులు పొందాలంటే ప్లానర్ దగ్గర్నుంచి టౌన్ ప్లానింగ్ అధికారుల వరకు ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉండేది. అనుమతులకై దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెండు, మూడు నెలలకు అనుమతులను మంజూరు చేసేవారు.
మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో అంతా అవినీతిమయం కావడంతో లంచమిస్తేనే అనుమతులిచ్చే పరిస్థితి ఉండడంతో భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణ అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం టీఎస్ బీ-పాస్ విధానాన్ని తీసుకువచ్చింది. టీఎస్-బీపాస్ విధానంతో తక్షణమే అనుమతులు మంజూరవుతున్నాయి. గత రెండేండ్లుగా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీల్లో 2501 భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తులురాగా, ఇప్పటివరకు 1825 దరఖాస్తులకు సంబంధించి అనుమతులు మంజూరు చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 1168 దరఖాస్తులకు 727, తాండూరులో 670కి 650, కొడంగల్లో 158కి 91, పరిగి మున్సిపాలిటీలో 505 దరఖాస్తులకు 357 దరఖాస్తులకు సంబంధించి అనుమతులు మంజూరు చేశారు.
టీఎస్-బీపాస్తో సత్వర అనుమతులు
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన టీఎస్-బీపాస్తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరవుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులకై రోజుల తరబడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని పత్రాలను ఆన్లైన్లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే క్షణాల్లో స్వీయ ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. సంబంధిత స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలోనూ భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్ విధానంలోనే జారీ అవుతున్నప్పటికీ ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అనంతరం 21 రోజుల్లో అనుమతులివ్వాలని నిబంధనలున్నప్పటికీ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే అనుమతులు జారీ చేసేవారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్ణీత సమయానికి రాకపోవడం, ఒకవేళ వచ్చినా ఏదో ఒక కొర్రీ పెట్టి లంచం డిమాండ్ చేయడం వంటివి జరుగుతుండేవి.
టీఎస్-బీపాస్ అమల్లోకి వచ్చిన అనంతరం భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల భాగస్వామ్యం లేకుండా నేరుగా భవన నిర్మాణదారులే టీఎస్-బీపాస్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందుతున్నారు. టీఎస్-బీపాస్ నిబంధనల ప్రకారం 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయిని చెల్లిస్తే సరిపోతుంది. 75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధ్రువీకరణ పత్రం ద్వారా అనుమతులిస్తున్నారు. 600 గజాలపైన 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారు, ఒకవేళ నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయలేనట్లయితే డీమ్డ్ అప్రూవల్ జారీ అవుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధం లేకుండా జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం(ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు) క్షేత్రస్థాయిలో ప్రతి పదిహేను రోజులకోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతోపాటు సంబంధిత భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకుంటారు.