తుర్కయాంజాల్, మార్చి 4 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరితపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ వార్డు కార్యాలయంలో బలపరీక్ష జరుగనున్నది. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగే మీటింగ్కు వైస్ చైర్పర్సన్ వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు హాజరవుతారా.. లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది.
ఇప్పటికే తుర్కయాంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధారాంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు విశ్వాస పరీక్షకు దూరంగా ఉంటారని తేల్చి చెప్పారు. వైస్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 16 మంది కౌన్సిలర్లు ఆమెకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే 16 మంది సభ్యులు మద్దతు అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బల పరీక్షకు హాజరుకాకపోతే అవిశ్వాసం వీగిపోయి వైస్ చైర్మన్గా హరిత కొనసాగుతారు.
అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు హాజరై బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటే మాత్రం వైస్ చైర్పర్సన్ పదవిని కోల్పోయే అవకాశం ఉన్నది. బల పరీక్షకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉంటారని చైర్పర్సన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేదా అనేది నేడు తేలనున్నది.