ఇబ్రహీంపట్నం, మే 3 : ఇబ్రహీంపట్నానికి ప్రభుత్వం నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నో ఏండ్లుగా ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ప్రతి బుధవారం ఇక్కడ జరిగే సంతతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రాన్ని కొత్తగా డివిజన్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నానికి కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను కేటాయించింది. త్వరలోనే సీఐ, ఎస్సైతో పాటు సిబ్బందిని కేటాయించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఈ స్టేషన్ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం నూతన భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసే అవకాశముంది.
ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలమవుతున్నది. ఇక్కడికి ప్రతిరోజు నగరం నుంచి వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు వందలాది వాహనాల్లో విద్యార్థులు వచ్చి వెళ్తుంటారు. దీంతో ఉదయం, సాయంత్రం ఇంజనీరింగ్ కళాశాల బస్సులతో బొంగుళూరు, మంగల్పల్లి, శేరిగూడ, ఇబ్రహీంపట్నంతో పాటు సాగర్ రహదారిపైన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. మరోవైపు రోడ్డు ప్రమాదా లు అధికమవుతున్నాయి. అలాగే, ఇబ్రహీంపట్నానికి ప్రతిరోజు పరిసర గ్రామాల నుంచి వందలాది వాహనాలు వచ్చి పోతున్నాయి. ఈ వాహనాలతో ఇబ్రహీంపట్నంలో ప్రధాన రహదారులైన సాగర్ రహదారి, త్రిశక్తి రోడ్డు, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు, మంచాల రహదారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది.
ట్రాఫిక్ సమస్యతో పాటు ఇబ్రహీంపట్నంలో రోడ్లపై అక్రమ పార్కింగ్ల సమస్య తీవ్రమైంది. పెద్ద ఎత్తున వ్యా పార, వాణిజ్య భవనాలతో పాటు దవాఖానాలు, విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. వీటికి సరైన పార్కింగ్ సౌ కర్యం లేక ప్రధాన రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. ము ఖ్యంగా సాగర్ రహదారికి ఇరువైపులా వాహనాల అక్రమ పార్కింగ్తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సాగర్ రహదారిపైన ఉన్న షాపుల ఎదుట వాహనాల అక్రమ పార్కింగ్తో పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్ల సమస్య కూడా తీరనుంది.
ఇబ్రహీంపట్నంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో పాటు అక్రమ పార్కింగ్ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం నూతనంగా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనుంది. దీంతో ట్రాఫిక్ సమస్య తీరనుంది. మరోవైపు అక్రమ పార్కింగ్ సమస్య తొలగిపోయే అవకాశముంది. ఇబ్రహీంపట్నంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రిని కోరాం. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటుకు కృషి చేశారు. – మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటుతో వాహనదారులకు సమస్యలు పూర్తిగా తొలగిపోనున్నాయి. ప్రభు త్వం మంజూరు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను త్వరలో ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తాం.
– ఉమామహేశ్వర్రావు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం