సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): 1969 తెలంగాణ ఉద్యమకారుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా సేవలందించిన దివంగత నేత డాక్టర్ మల్లికార్జున్ విగ్రహాన్ని త్వరలో చేవెళ్లలో ప్రారంభించనున్నట్లు మల్లికార్జున్ సతీమణి భాగ్యలక్ష్మి, కుమారుడు మనూమల్లికార్జున్ తెలిపారు. చండీగఢ్లోని రాజ్భవన్లో మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు.
మల్లికార్జున్ 2002 డిసెంబర్ 24న దివంగతులయ్యారని, ఆయన సేవలు మరువలేనివన్నా రు. మహబూబ్నగర్ ఎంపీగా నాలుగు సార్లు.. మెదక్ నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి ప్రధానులు ఇందిర, పీవీ కేబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారన్నారు. తెలంగాణ సాధన కోసం 1969లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించినట్లు వారు తెలిపారు.