శంకర్పల్లి, జూన్ 5 : తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని మోకిల గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖ అమలు చేస్తున్న నూతన విధానాల వల్ల 9 సంవత్సరాలలో క్రైం రేట్ పూర్తిగా తగ్గిందని వివరించారు. దేశంలో సురక్షితమైన నగరంగా హైదరాబాద్ నిలిచిందంటే ప్రభుత్వ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి, అదనపు డీజీపీ సాధన రష్మి పెరుమాల్, అసిస్టెంట్ కమిషనర్ రమణగౌడ్, సీఐలు నరేశ్, శివ కుమార్, సంజయ్ కుమార్, ఎస్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జీవితం యువతకు ఆదర్శం
మొయినాబాద్ : అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జవన్రామ్ విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే నేడు పరిపాలన కొనసాగుతున్నదన్నారు.
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆనాడే దూర దృష్టితో భారత రాజ్యాంగంలో రాసిన కాల జ్ఞాని అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ కె అనంతరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, సర్పంచ్ బి వినిత, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, సర్పంచ్ కె రత్నం, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు, సీనియర్ నాయకులు రవియాదవ్,ఎం మధుసూదన్రెడ్డి, కరుణాకర్గౌడ్,ఈశ్వర్, రమేశ్, పరమేశ్, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షుడు గడ్డం కుమార్ తదితరులు పాల్గొన్నారు.