రంగారెడ్డి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతి నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించడంతోపాటు ఫైరింజన్లు, 108 అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. శంకర్గౌడ్ ఉద్యోగుల డిమాండ్ల కోసం ఆత్మహత్య చేసుకున్నందున అన్ని డిపోల ఎదుట ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, ఆమనగల్లు, షాద్నగర్, హయత్నగర్, బండ్లగూడ వంటి డిపోల పరిధిలో మూడో రోజు కూడా ఒక్క బస్సూ బయటకు రాలేదు. బస్సు డిపోల ఎదుట కార్మికులు శుక్రవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంటావార్పు చేశారు.
సమ్మె నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు రాకపోవడంతో వివిధ పనులు, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగస్తులు, కూలీలు అనేక అవస్థలకు గురవుతున్నారు. ప్రైవేట్ వాహనాలు కూడా సరిగ్గా లేకపోవటంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. సర్కారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రామీణ ప్రాంతాలకు సక్రమంగా బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు జిల్లావ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, జేఏసీలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చాయి. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారన్నారు. సర్కారు వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
శంకర్గౌడ్ది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
వికారాబాద్, ఏప్రిల్ 24 : శంకర్గౌడ్ది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోరాడుతూ నర్సంపేట ఖానాపూర్కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. శంకర్గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నామన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడంతో అటు ఆర్టీసీ కార్మికులకు.. ఇటు సామాన్య ప్రజలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నదన్నారు. సర్కారు వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికులెవ్వరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయబద్దంగా పోరాడి హక్కులను సాధించుకుందామన్నారు.