యాచారం, మార్చి 6 : మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం ప్రధాన పుణ్యక్షేత్రాలకు నిలయంగా విరాజిల్లుతుంది. గ్రామీణ ప్రాంతంలో దేవాలయాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచింది. వందల ఏండ్ల చరిత్రగల ఆలయాలతో ఆ గ్రామం భక్తి భావాన్ని వెదజల్లుతుంది. అక్కన్న మాదన్న, కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు గ్రామంలో దర్శనమిస్తున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా నూటొక్క నందులకే నిలయంగా నిలిచింది.
గ్రామంలో ఒక శివుని గుడి ఉంటేనే గ్రామస్తులు ఎంతో గొప్పగా భావిస్తారు. అలాంటిది ఒకే గ్రామంలో అత్యంత పురాతనమై వందల ఏండ్ల చరిత్రగలిగిన దేవాలయాలు సిద్ధేశ్వరాలయం, ఓం కారేశ్వరాలయం, నందీశ్వర మహాక్షేత్రం ఉండటం ఎంతో అరుదుగా చెప్పవచ్చును. వీటితో పాటు చెన్నకేశవ ఆలయం, అభయాంజనేయస్వామి ఆలయం, రామాలయం, జ్ఞానసరస్వతి దేవాలయం, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి. శివరాత్రి పర్వదినం రోజున గ్రామంలో జాతరలు, బ్రహ్మోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొననుంది. గ్రామం మొత్తం శివనామస్మరణతో మారుమ్రోగనుంది.
గ్రామం నడిబొడ్డున అతిపురాతన ఓం కారేశ్వరాలయం ఉంది. వందల ఏండ్ల చరిత్ర గల ఆలయంలో శివ పార్వతులతో పాటు సీతారామాంజనేయ స్వాములు కొలువుదీరారు. ఆలయానికి 1471 ఎకరాల దేవాలయ భూములున్నాయి. శివపార్వతుల పంచలోహ విగ్రహాలున్నాయి. ఆల యం ముందు పురాతన కోనేరు, కల్యాణ మండపం ఎంతో ఆకట్టుకుంటుంది. శివరాత్రి రోజున అఖిలాండకోటి బ్రహ్మాండరూపుడైన ఓంకారేశ్వరుడికి రుద్రాభిషేకం, పార్వతిసమేత ఓంకారేశ్వరుడి కల్యాణ మహోత్సవం, అన్నదానం, ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
నందివనపర్తిలో 150 ఏండ్ల చరిత్రగల ఈ ఆలయంలో స్వయం భూ శివలింగం ఉంది. శివలింగంపై సూర్యకిరణాలు పడటంతో ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైందని భక్తులు భావిస్తారు. కాకతీయుల కాలంలో ఆలయం రూపుదిద్దుకున్నట్లు ప్రతీతీ ఆలయం గర్భగుడి పూర్తిగా రాతి నిర్మాణం కావడం, ముందు నుంచి రాతి స్తంభాలతో వెయ్యి స్తంభాల గుడిని తలపిస్తుంది. గర్భగుడిలో పై భాగంలో శ్రీశైలం ఆలయ మాదిరిగా శ్రీచక్రం ఉంది. గర్భగుడిలో ఏకశిలపై స్వయం భూ శివలింగం, ఆలయం ముందు నంది విగ్రహం, అతి పురాతన రాతికట్టడం గల సుందరమైన కోనేరు ఉంది.
ఆలయం ఆవరణలో పురాతన నాగులమ్మ, నాగుపాముల ప్రతిమలు రాళ్లపై చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో శివరాత్రి రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఆలయ పరిసరాల్లో పెద్ద నాగుపాము సంచరిస్తుందని, ఆలయానికి రక్షణగా ఉంటూ అప్పుడప్పుడు శివలింగాన్ని చట్టుకుంటుదని గ్రామస్తులు అంటుతన్నారు. శివరాత్రి రోజున స్వయంభూ శివలింగానికి అభిషేకం, పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఆలయం కిక్కిరిసి పోతుంది.
మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో కొలువుదీరిన పాలేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆలయంలో అన్నదానం, వ్రతాలు, పల్లకిలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వాహకులు డేరంగుల నర్సింహ్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మండలంలోని గున్గల్, గాండ్లగూడ, నల్లవెల్లి తదితర గ్రామాలలో శిరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.