వెంగళరావునగర్/వికారాబాద్ జనవరి 11 : అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు కాస్తున్న మాతృమూర్తి హృదయ వేదనపై బుధవారం నమస్తే తెలంగాణలో ‘మా బిడ్డల్ని మాకివ్వండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి హైకోర్టు న్యాయమూర్తి ఎం.జి. ప్రియదర్శిని స్పందించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం పగిడ్యాలకు చెందిన కప్పెరి ఎల్లప్ప, నర్సమ్మ దంపతులు శైలజ (6), సంజు (4), వైశాలి (ఏడాది) అనే ముగ్గురు సంతానంతో బేగంపేట్లో రైలు దిగారు. శివరాంపల్లి వెళ్లేందుకు బస్ చార్జీల కోసం బిడ్డలతో కలిసి దంపతులు భిక్షాటన చేస్తూ ఆపరేషన్ స్మైల్ అధికారులకు చిక్కారు. వీరి ముగ్గురు పిల్లల్ని అధికారులు వెంగళరావునగర్ డివిజన్లోని స్టేట్హోంకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఏడాది వయస్సున్న కుమార్తె వైశాలికి పాలివ్వడానికి అనుమతించాలని శిశు సంక్షేమ శాఖ గేట్ ఎదుట ఐదు రోజులుగా నిరీక్షిస్తున్న వైనంపై హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని స్పందించారు. బిడ్డల్ని ఎప్పుడైనా చూసుకునేందుకు ఆమెకు అనుమతించాలని, పిల్లల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజ, వికారాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ కె.సుదర్శన్, సెక్రటరీ, సీనియర్ న్యాయమూర్తి డి.బి.శీతల్కు ఆదేశాలిచ్చారు. దీంతో ఏడాది వయస్సున్న బిడ్డను తల్లి నర్సమ్మకు అధికారులు అప్పగించారు. మరో ఇద్దరు పిల్లలను వారం రోజుల్లోపు తీసుకెళ్తానని చెప్పింది.