రంగారెడ్డి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా వివిధ కార్యక్రమాలను చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఉపాధ్యాయుల్లోనూ వినూత్నమైన ఆలోచనల సామర్థ్యాల పెంపు దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా టీచర్స్ ఇన్నోవేషన్ రెపోసిటరీ(టీఐఆర్) పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయుల్లో ఉన్న ప్రతిభను మరింత పదును పెట్టేందుకు ఇది వేదికగా నిలువనుంది. విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలను ఈ పోర్టల్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అత్యుత్తమ ప్రదర్శనలకు ప్రశంసాపత్రాలతోపాటు పురస్కారాలను అందించనున్నారు.
మెరుగైన బోధనా విధానం..
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇంటింటా ఇన్నోవేటర్, ఇన్స్పైర్ మనాక్ కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులనూ ప్రోత్సహిస్తూ వస్తున్నది. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం టీచర్స్ ఇన్నోవేషన్ పేరిట భావితరాలకు ఉపయోగపడే ఆవిష్కరణలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఈమేరకు ts.tir. telangana. gov.in పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుల సహకారంతో టీచర్ ఇన్నోవేషన్ ప్రక్రియకు కార్యరూపం ఇచ్చారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో తాము రూపొందించిన వినూత్న బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు పోర్టల్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యాబోధనను సరళతరం చేసేందుకు టీచర్స్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్నది. ఇదే క్రమంలో చేపడుతున్న టీచర్స్ ఇన్నోవేషన్తో ఉపాధ్యాయుల వినూత్న ఆలోచనలు విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చనున్నాయి.
నైపుణ్యం, పరిజ్ఞానం పెంపునకు దోహదం
రంగారెడ్డి జిల్లాలో 1,270 పాఠశాలలు ఉండగా.. హైస్కూల్ స్థాయిలో 2,887 మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అవలంబిస్తున్నారు. కథా రూపంలో, వర్చువల్ విధానంలో, ఆట పాటలతో.. ఇలా అనేక పద్ధతుల్లో బోధనను సాగిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలకు ఇప్పటివరకు సరైన వేదిక అంటూ లేకపోవడంతో ఆచరణలోకి కూడా రాలేదు. ఇకపై ఈ తరహా ఆలోచనలను టీచర్స్ ఇన్నోవేషన్ పోర్టల్లో ఉపాధ్యాయులు పంచుకునే అవకాశం కలుగుతుంది. ఈ పోర్టల్లో నమోదైన ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులను ఇవ్వనున్నారు. నిత్యం ప్రోగ్రాం, ఈవెంట్స్తో ఉపాధ్యాయులను ఉత్తేజపరిచేలా వివిధ మల్టీమీడియాలను, విద్యావేత్తల సంఘాలను ఈ పోర్టల్లో భాగస్వాములను చేస్తున్నారు.
ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి
– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి
టీచర్స్ ఇన్నోవేషన్ రెపోసిటరీ పోర్టల్ను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. వినూత్న ఆలోచనలను పోర్టల్లో పొందుపర్చడం వల్ల ఇతర ఉపాధ్యాయులు ఆచరించి మెరుగైన విధానంలో బోధించే అవకాశం కలుగుతుంది. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు నైపుణ్యంతోపాటు పరిజ్ఞానం పెరగడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.