షాద్నగర్టౌన్ : రుద్రావతార వీర.. వీరభద్ర అంటూ భక్తులు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం ముగింపు, అమావాస్య సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలోని వీర భద్రస్వామికి శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. అమావాస్య రోజున స్వామివారికి పూజలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు.
స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అదే విధంగా కార్తికమాసం ముగింపు సందర్భంగా సహస్ర దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో శివుడి, గణనాథుడి, అమ్మవారి రూపాలలో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించారు. దేవతామూర్తుల రూపాలలో ఏర్పాటు చేసిన దీపాకృతులు భక్తులను ఆకట్టుకున్నాయి.