హయత్నగర్ రూరల్ : గురువారం ఉదయం 5.50నిమిషాలు. ‘మా బాబు కనిపించడం లేదు’ అంటూ ఆందోళన చెందుతూ 100కు ఓ ఫోన్ వచ్చింది. నిమిషాల్లో ఇద్దరు పెట్రోల్ మొబైల్ సిబ్బంది ఔటర్ రింగ్రోడ్డుపై బాచారం సర్వీస్ రోడ్డుపైకి చేరుకున్నారు. కాల్ చేసిన తల్లిదండ్రులను కలిశారు. వెతికి ఐదేండ్ల బాబును సురక్షితంగా వారి చేతుల్లో పెట్టారు. నందమూరి నాని, స్వాతి దంపతులు తమ ఐదేండ్ల కొడుకు విక్కీని తీసుకుని బైక్పై రాంపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరారు. ఉదయం బాచారం పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఆగారు. మూత్ర విసర్జనకు వెళ్లగా విక్కీ అదృశ్యమయ్యాడు.
తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా జాడ దొరకలేదు. గాబరా పడుతూ 100కు ఫోన్ చేయగా.. ఇద్దరు పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పిల్లాడిని వెతికి పట్టుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్టు సీఐ స్వామి తెలిపారు. వెంటనే స్పందించి, తమ కొడుకును వెతికి పట్టుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు నాని, స్వాతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.