షాద్నగర్ : ఏ ప్రభుత్వమైన రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారనే విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను కలిసిన సందర్భంగా మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపారని, ఫలితంగా మూడు చట్టాలను ఎత్తివేస్తూ ప్రకటన వెలువడిన నేపథ్యంలో దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నూతన చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులు, ప్రజలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని తెలిపారు. రైతులు 24గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ తెలంగాణ సీఎం కేసీఆర్కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ పనితీరు ఆదర్శనీయమని కొనియాడారు.
ప్రపంచ మహమ్మారి కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతున్న సమయంలో రైతులు మాత్రం ధైర్యంగా పొలానికి వెళ్లి పంటలు వేశారన్నారు. ఆగమ్యగోచరంగా మారిన అన్నదాతల దుర్భర బతుకులకు అద్దం పట్టేలా తాను తీసిన సినిమా రైతన్న ఉంటుందన్నారు. తాను నటించిన రైతన్న సినిమాను ఆదరించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, రాజవరప్రసాద్, రాంబల్నాయక్, లక్ష్మణ్నాయక్, వెంకటేష్, బాలరాజ్ పాల్గొన్నారు.