ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువు తూముపై నుంచి దూకిన ఇంజినీరింగ్ విద్యార్థి సంఘటన కలకలం రేపింది. తూముపై నుంచి అందరూ చూస్తుండగానే దూకాడు. సీఐ సైదులు కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన విష్ణువర్ధన్రెడ్డి శేరిగూడలోని అతడి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం 10గంటల సమయంలో ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై ఉన్న తూము వద్దకు చేరుకున్నాడు. అతడి ఐడీ కార్డు, ఇతర పేపర్లను తూము వద్ద పడవేసి చెరువులోకి దూకాడు. అక్కడ ఉన్న పర్యాటకులు కాపాడడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి చెరువులో పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో నీరు నిల్వ అధికంగా ఉండటంతోపాటు చెరువులో ముండ్లకంపలు ఉండటం వల్ల ఆచూకీ లభించలేదు. మంగళవారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీఐ సైదులు తెలిపారు. విష్ణువర్ధన్రెడ్డిని రికవరీ ఏజెంట్లు పలుమార్లు వేధింపులకు గురిచేయడంవల్లే చెరువులో దూకినట్లు అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, మృతుడి ఆత్మహత్యపై పోలీసులు కూడా పలు రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు.