అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయబంధానికి ప్రతీక రాఖీ పండుగ.. తోబుట్టువుల ఆప్యాయత, జీవితాంతం తరిగిపోని అనుబంధానికి మారుపేరైన రక్షాబంధన్ వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వైభవంగా జరిగాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొని జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పార్టీ శ్రేణులు, అభిమానులు రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరులో తమ్ముడు నర్సింహారెడ్డికి మంత్రి సబితారెడ్డి రాఖీ కట్టారు. పలువురు ఎమ్మెల్యేలకు సోదరీమణులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు రాఖీలు కట్టి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ అనురాగాల పూలు పూయించారు. ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు భరోసానిచ్చారు. ఉదయం నుంచి ఆలయాల్లో తమ కుటుంబాలు బాగుండాలని ప్రత్యేక పూజలు చేసి సంతోషంగా గడిపారు.
రంగారెడ్డి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని ఎల్బీనగర్ బాలల సంరక్షణ కేంద్రంలో అనాథ, నిరుపేద విద్యార్థుల మధ్య జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సహోదర భావాన్ని చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకకు వజ్రోత్సవ సంబురాలతో మిలితం చేయడం రక్షాబంధన్ పండుగకు మరింత ప్రాధాన్యత చేకూరిందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తూ రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నామన్నారు.
బాలల సంరక్షణ కేంద్రంలో బాలికలతో బాలురకు రాఖీలు వారి సమక్షంలో కట్టి ప్రతీ విద్యార్థి సోదర, సోదరీమణులమనే భావన విద్యార్థుల మనస్సులో కలగాలనే రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి విద్య, జిల్లా శిశు సంక్షేమాధికారి మోతి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డీసీపీవో ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఉద్యోగులతో ర్యాలీలు నిర్వహించి మైదానాల్లో త్రివర్ణ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఉదయం 8 గంటలకు సరూర్నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ నుంచి కొత్తపేట ఎక్స్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి, జాతీయ జెండాను ప్రదర్శించనున్నారు.
సోదరుడికి రాఖీ కట్టిన మంత్రి..
సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా సోదరుడు నర్సింహా రెడ్డి ఇంటికి వెళ్లి మంత్రి సబితాఇంద్రారెడ్డి రాఖీ కట్టారు.
వికారాబాద్ జిల్లాలో ..
పరిగి, ఆగస్టు 12 : వికారాబాద్ జిల్లాలో సమైక్యతా రక్షాబంధన్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఒక్కో గ్రామంలో 75 మందికి రాఖీలు కట్టారు. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 5వేల రాఖీలు తయారు చేయించడంతోపాటు ప్రతి గ్రామానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు స్థానిక ప్రజా ప్రతినిధులకు రాఖీలు కట్టారు. సమైక్యతా రక్షాబంధన్లో భాగంగా వికారాబాద్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, కొడంగల్లో పట్నం నరేందర్రెడ్డి, తాండూరులో పైలెట్ రోహిత్రెడ్డిలు పాల్గొనగా.. స్వయం సహాయక సంఘాల మహిళలు రాఖీలు కట్టారు. అధికారులు సైతం పలు గ్రామాల్లో రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.