ఆదిబట్ల, ఏప్రిల్29 : ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుదారుల కోసం తీసుకువచ్చిన 5 శాతం రాయితీ పథకం నేటితో ముగియనుంది. 2022-23 సంవత్సరానికి గానూ ముందస్తుగా ఆస్తిపన్ను ఈ నెలలోనే చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. శనివారం ఒక్కరోజే సమయం ఉన్నది. శనివారం రాత్రి 11 గంటల వరకూ ఆన్లైన్లో పన్ను చెల్లించి రాయితీ పొందే వీలు ఉంది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మంగళ్పల్లి, పటేల్గూడ, రాందాస్పల్లి, బొంగ్లూరు గ్రామాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎర్లీబర్డ్ పథకంలో భాగంగా అధికారులు రూ.1.57 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు రూ.46.88లక్షల మాత్రమే వసూలు చేశారు. గత ఏడాది కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తడం వల్ల రూ.19లక్షలు వసూలు చేశారు.
అవగాహన కార్యక్రమాలతో..
ప్రభుత్వం ప్రకటించిన 5శాతం రాయితీ విషయంపై మున్సిపాలిటీ పరిధిలోని ఆరు గ్రామాల్లో కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది 5శాతం పన్ను రాయితీపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. వార్డు కార్యాలయాలు, గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అధికారులు లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా రూ.కోటికి పైగా వసూలు చేయాల్సింది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం పన్ను రాయితీని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. శనివారంతో గడువు ముగియనున్నది. సకాలంలో పన్నులు చెల్లిస్తే చెల్లించిన వారికి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆయా గ్రామాల్లోని ప్రజలకు మా సిబ్బంది, అధికారులు అందుబాటులో అందుబాటులో ఉంటున్నారు. ఆన్లైన్లో కూడా చెల్లించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రూ.46.88లక్షల పన్ను వసూలు అయ్యాయి.
– అమరేందర్రెడ్డి, కమిషనర్