రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. గురువారం ఆమె ఇంటర్, పదోతరగతి పరీక్షలను పురస్కరించుకుని చేపట్టాల్సిన వివిధ అంశాలపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ దేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్తో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ పరీక్షా కేంద్రా ల్లో అవసరమైన వసతులను కల్పించాలన్నారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ ఇంటర్, పదోతరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో పదోతరగతి పరీక్షా కేంద్రాలు 283, ఇంటర్ పరీక్షా కేంద్రాలు 156 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరాతోపాటుసీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా బస్సులను నడిపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రథమ చికిత్స అందించేందుకు మందులు, వోఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామన్నారు. పరీక్షా కేం ద్రాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్త్తోపాటు 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డీసీపీ శిల్పవల్లి, వెంక్యానాయక్ పాల్గొన్నారు.
అనంతరం వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించని విషయాన్ని విద్యార్థులకు స్పష్టం గా తెలియజేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల సందర్భంగా కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారని, అలాంటి వారిని గుర్తించి మనోధైర్యాన్ని కల్పించేందుకు మానసిక వైద్యులను సంప్రదించేందుకు వీలుగా 24 గంటలు అందుబాటు లో ఉండేలా 18005999333 టోల్ఫ్రీ నంబర్ను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చాలని, నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు.
పరీక్షా కేం ద్రాల వద్ద ఏఎన్ఎంలను నియమించడంతోపాటు వోఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, టెంట్, తాగునీటి వసతి కల్పించాలన్నారు. విద్యార్థులు పరీక్షలకు సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఐఈవో శంకర్, డీఈవో రేణుకాదేవి, జిల్లా వైద్యాధికారి తుకారాం, ఆర్టీసీ డీఎం మహేశ్, డీటీవో దశరథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.