సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : నిర్మాణ రంగ అనుమతుల్లో జీహెచ్ఎంసీ నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ అనుమతులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీ పాస్ విధానాన్ని 16 నవంబర్ 2020లో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పది కార్పొరేషన్ల పరిధిలోని నిర్మాణ రంగ అనుమతులపై మంగళవారం టీఎస్ బీ పాస్ నివేదికను విడుదల చేసింది. 36,658 కొత్త ఇండ్ల అనుమతులతో జీహెచ్ఎంసీ ప్రథమ స్థానంలో నిలువగా, వరంగల్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో గ్రేటర్ పక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్లైన బడంగ్పేట, బోడుప్పల్, తుర్కయాంజాల్ చోటు దక్కించుకున్నాయి. మిగిలినవి ఇతర మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్, శివారు మున్సిపాలిటీల్లో భారీ అపార్ట్మెంట్లు, ఆకాశహర్మ్యాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు వెల్లువలా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ మహా నగర పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధుల్లోనూ టీఎస్ బీపాస్ కింద అనుమతులే ఇందుకు నిదర్శనం.