తాండూరు, నవంబర్ 20 : రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ భారత ప్రధాని అవడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. బీజేపీ బరితెగింపు విధానానికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అమ్ముడుపోకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తాండూరు నిజాయితీని టీఆర్ఎస్పార్టీతో పాటు దేశానికి వన్నె తేవడంతో తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఆదివారం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం కల్పించిన జడ్ కేటగిరి సెక్యూరిటీతో వేలాది మంది ప్రజల మధ్య ఎమ్మెల్యేను ప్రత్యేక వాహనంలో తాండూరులో ఘనంగా ఊరేగించారు. వందల కోట్లు ఆశపెట్టిన బీజేపీకి అమ్ముడుపోకుండా నిజాయితీని చాటి బీజేపీకి గుణపాఠం చెప్పిన రోహిత్రెడ్డిని భారీ గజమాలలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం భద్రేశ్వరచౌక్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ దేశంలో ఎదురులేని శక్తిగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీఆర్ఎస్ ఘనవిజయం ఖాయమన్నారు. బీజేపీ ఓటమి భయంతో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనాలనుకున్నది వాస్తవమన్నారు. బీజేపీలోకి వస్తే రూ.100 కోట్లు, వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని తమకు చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తాండూరు ప్రజల కోసం నేను అమ్ముడుపోలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. దీంతో తాండూరును రాష్ట్రంలో ఆదర్శవంతంగా మారుస్తామన్నారు. ఊపిరి ఉన్నంత వరకు తాండూరు అభివృద్ధికోసం కేసీఆర్తోనే ఉంటానని ప్రమాణం చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని అనుకున్న బీజేపీ కొడుకులకు చుక్కలు చూపించి జైలు కూడు తినిపిస్తున్నామని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా తాండూరుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తాండూరుకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఐటీఐ కళాశాలను కూడా ప్రారంభిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తాండూరుకు మరిన్ని నిధులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉంటూ తాండూరు అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజుగౌడ్, రాష్ట్ర నాయకుడు శ్రీశైల్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. తెలంగాణలో మోదీ, అమిత్షా ఆటలు సాగవని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంటే బీజేపీ ఈర్ష్యతో తెలంగాణపై సవతిప్రేమ చూపిస్తూ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటని విమర్శించారు. పక్కా స్కెచ్తో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బీజేపీ కుట్రలను బయటపెట్టడం గొప్పవిషయమన్నారు.
ప్రజా సేవలో నిరంతరం ఉండే రోహిత్రెడ్డి ప్రలోభాలను పారదోలుతూ బీజేపీకి గుణపాఠం చెప్పడం రాజకీయానికే ఆదర్శమన్నారు. తెలంగాణలో మహారాష్ట్ర, ఇతర రాష్ర్టాల తరహా బీజేపీ రాజకీయాలు చెల్లవన్నారు. ఎన్నికల్లో నిలబడి గెలిచే దమ్ములేని బీజేపీ టీఆర్ఎస్పై ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణలో చెల్లవన్నారు. మతం పేరుతో రాజకీయం చేసే పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో మోదీ చేస్తున్న పనికిమాలిన పనులకు తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకొని బయట తిరగరాదన్నారు. బాధ్యతగల పౌరులుగా తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బషీరాబాద్ అధ్యక్షుడు రాములునాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.