రంగారెడ్డి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా పరిశ్రమల కేంద్రం నిత్యం కృషి చేస్తున్నది. పరిశ్రమలను స్థాపించేందుకు కావాల్సిన పారిశ్రామిక అనుమతులను ప్రభుత్వం ఔత్సాహికుల కోసం అందుబాటులోకి తెస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించుకోవాలని అర్హులు, ఉత్సాహవంతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఉత్పత్తులు, సేవల రంగాలకు సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతను ఇస్తూ, పలు రాయితీలను కల్పిస్తున్నాయి. స్వయం ఉపాధి కల్పించేందుకు, సూక్ష్మ ఆహార ఉత్పత్తులను తయారుచేసేందుకు జిల్లాలోని పరిశ్రమల కేంద్రం అర్హులు, ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నది.
ఉపాధి కోసం పరితపించే, ఆహార ఉత్పత్తుల కోసం సాహసం చేయగల ఔత్సాహిక అభ్యర్థులకు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తున్నది. జిల్లాలోని ఆసక్తి కలిగిన నిరుద్యోగులు, రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువకులు, మహిళలు ఎవ్వరైనా ఈ ఉపాధి, ఉత్పత్తుల తయారీ పథకాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనవచ్చని, ఇందుకు సంబంధించి ఉత్సాహవంతులు సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించుకోవచ్చని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక మద్దతు, సహాయం అందించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ’ పథకాలను చదువుకున్నా, చదువుకోకున్నా, ఆదాయ పరిమితి లేకున్నా 18 ఏండ్ల పైబడి ఉన్న అందరి కోసం అందుబాటులోకి తెచ్చింది. స్వయం ఉపాధి కోసం సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పేందుకు ఈ పథకాలు అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఈ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 21న చిలుకూరులోని టీటీడీసీలో ఉదయం 11 గంటలకు శిబిరాన్ని పరిశ్రమల కేంద్రం వారు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గలవారు పాల్గొనవచ్చు.
సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ పథకం
ఈ పథకానికి వ్యక్తిగత, యాజమాన్యం, సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ఎఫ్పీవో (రైతుల ఉత్పత్తి సంస్థ), ఎన్జీవో, ఎస్హెచ్జీ (స్వయం సహాయక బృందాలు), ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అర్హులు. వయసు 18 ఏండ్ల పైబడాలి. ఇందుకు కనీస విద్యార్హతలు ఏమీ లేవు.
సమూహ ప్రాజెక్టులకు..
యజమాని, భాగస్వామ్యం, ఎఫ్పీవో, ఎన్జీవో, ఎస్హెచ్జీ, కో ఆప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మొదలైన సమూహ వర్గం ద్వారా అర్హత గల ప్రాజెక్టులకు గరిష్టంగా కోటి రూపాయల మద్దతు ఇవ్వనున్నారు. క్రెడిట్ లింక్ సబ్సిడీ 35% ఉంది. సమూహ ప్రాజెక్టులకు గరిష్ట మద్దతు రూ.3 కోట్ల వరకు ఉంది.
వ్యక్తిగత ప్రాజెక్టులకు..
వ్యక్తిగత ప్రాజెక్టులకు గరిష్ట ప్రాజెక్టు వ్యయం కోటి రూపాయల వరకు అందించనున్నారు. ఇందులో 35% క్యాపిటల్ లింక్ సబ్సిడీ ఇస్తున్నారు. అర్హత గల ప్రాజెక్టులకు గరిష్టంగా రూ.10 లక్షలు. ప్రాజెక్టు ఖర్చు, యంత్రాలు, సాంకేతిక నిర్మాణ ఖర్చు పరిగణించనున్నారు. పరిశ్రమ షెడ్/భూమి అద్దె సబ్సిడీలో భాగం కాదు. లబ్ధిదారుడి మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 10% సొంత సహకారం కలిగి ఉండాలి. సాంకేతిక నిర్మాణ పని అర్హత గల ప్రాజెక్టులలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు.
ఆర్థిక సాయం
తయారీ రంగం-ఉత్పత్తి పరిశ్రమలకు రూ.50 లక్షల వరకు, సేవారంగ పరిశ్రమలకు 20 లక్షల వరకు బ్యాంకు రుణాలను అందిస్తున్నది. ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రాజెక్టు రాయితీ (సబ్సిడీ) ఇస్తుంది. లబ్ధిదారుడి వాటా ప్రాజెక్టు వ్యయంలో 5% నుంచి 10% వరకు ఉంటుంది. కొత్తగా స్థాపించే సూక్ష్మ తరహా పరిశ్రమలకు మాత్రమే రుణ సదుపాయం లభించనుంది. ప్రతిభావంతంగా నిర్వహించబడుతున్న పరిశ్రమల విస్తరణ కోసం రెండోమారు ఆర్థిక సాయం పొందే వీలుంది. తయారీ రంగానికి కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. కాగా, సేవా రంగానికి 25 లక్షల వరకు పొందవచ్చు. అయితే, ప్రాజెక్టు వ్యయంలో 15% వరకు ప్రభుత్వ రాయితీ ఉంది.
ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు
బేకరీ ఉత్పత్తులు, తృణ ధాన్యాలు-పప్పులు, ఆధారిత ఉత్పత్తులు, సిట్రస్ ఆధారిత ప్రొడక్ట్స్, కొబ్బరి-కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, మొక్కజొన్న ఉత్పత్తులు, పండ్లు-ఆధారిత ఉత్పత్తులు, వేరుశనగ-ఆధారిత ఉత్పత్తులు, పాలు-ఆధారిత ఉత్పత్తులు, పుట్ట గొడుగులు-ఆధారిత ఉత్పత్తులు (పొడి అంశాలు), నూనె గింజలు-ఆధారిత ఉత్పత్తులు (కుసుమ నూనె, పొద్దు తిరుగుడు, కొబ్బరినూనె, నువ్వులు), రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ (రైస్, రవ్వ), ఆర్టీఈ-తినడానికి సిద్ధంగా ఉండేవి, సోయా పాలు, సోయా పన్నీర్ మొదలైనవి సోయాబీన్ (ఆధారిత ఉత్పత్తులు), సుగంధ ద్రవ్యాలు-వాటి ఉత్పత్తి, చెరుకు-ఆధారిత ఉత్పత్తులు, ముడి కూరగాయలు-ప్యాకింగ్ (ఫ్రైడ్ ముక్కలు) మొదలైన వంటివి.
అర్హులు
– 18 ఏండ్ల పైబడిన వ్యక్తులు
– ఆదాయ పరిమితి లేదు
– రూ.5 లక్షల ప్రాజెక్టు వ్యయం వరకు ఎటువంటి విద్యార్హత అవసరంలేదు.
– తయారీ రంగంలో రూ.10 లక్షలు.. ఇంకా సేవా రంగంలో రూ.5 లక్షలు పైబడిన వ్యయం కలిగిన
ప్రాజెక్టులకు కనీస విద్యార్హత 8వ తరగతి
అవగాహన శిబిరంలో పాల్గొనండి: రాజేశ్వర్రెడ్డి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం
సేవల రంగానికి రూ.25 లక్షల దాకా, ఉత్పత్తుల రంగానికి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డెయిరీ, పౌల్ట్రీ, సెరికల్చర్, ఫిషరీస్ ఫామ్లను ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇవి ఎంతగానో దోహదపడుతాయి. డీసీసీబీ బ్యాంకుల యాజమాన్యం నిరుద్యోగులు, ఔత్సాహికులకు పరిశ్రమల ఏర్పాటులో సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 21 మండలాల్లో పలు పథకాలపై అవగాహన శిబిరాలను నిర్వహించాం. ప్రస్తుతం ఆసక్తిగల అభ్యర్థుల కోసం ఈ నెల 21న చిలుకూరు టీటీడీసీలో ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆసక్తి గలవారు ఈ అవగాహన శిబిరంలో పాల్గొనవచ్చు.