పరిగి, ఆగస్టు 3 : బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కొర్రీలు పెడుతూ వస్తూ గత యాసంగి, వానకాలం కస్టమ్ మిల్లింగ్కు ఈ నెలాఖరు వరకు గడువు విధించింది. సుమారు 40 రోజులపాటు కస్టమ్ మిల్లింగ్ను నిలిపివేయడంతో మిల్లర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమంటూ కేంద్రం తిరకాసు పెట్టి మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. జూన్ 7 నుంచి సీఎంఆర్ సేకరణను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర నష్టమే జరిగింది. 2020-21 యాసంగి సీజన్, 2021-22 వానకాలం వడ్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఆగస్టు నెలాఖరు వరకు అందజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెండు సీజన్లకు కలిపి 40శాతం బియ్యం
2020-21 యాసంగి, 2021-22 వానకాలం సీజన్లకు సంబంధించిన బియ్యం సుమారు 40శాతం సీఎంఆర్ పూర్తిచేసి అందించాల్సి ఉన్నది. 2020-21 యాసంగిలో జిల్లాలోని 42 రా రైస్మిల్లులకు 31,797 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సీఎంఆర్ కోసం అందజేశారు. సీఎంఆర్ పూర్తిచేసి 21,304 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉండగా వంద శాతం అందజేయడం పూర్తయింది. బాయిల్డ్ రైస్మిల్లులకు 51,375 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అందజేయగా 34,935 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్మిల్లర్లు సీఎంఆర్ తర్వాత ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 31,054 మెట్రిక్ టన్నుల బియ్యం అందించారు. 90 శాతం సీఎంఆర్ పూర్తవగా మరో పది శాతం పూర్తి చేసి అందించాల్సి ఉన్నది. 2021-22 వానకాలానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా మొత్తం 1,14,600 మెట్రిక్ టన్నుల వడ్లు సీఎంఆర్ కోసం వికారాబాద్ జిల్లాలోని 58 రైస్మిల్లులకు అందించింది. కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేసి 76,785 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్మిల్లర్లు అందజేయాల్సి ఉండగా ఇప్పటివరకు 50,243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్మిల్లర్లు అందజేశారు. తద్వారా ఇప్పటివరకు 65శాతం బియ్యం అందించగా 35 శాతం బియ్యం అందించాల్సి ఉన్నది. రైస్మిల్లర్లు ఇంకా 26,542 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఈ బియ్యాన్ని ఆగస్టు 31 వరకు అందించాలని ఎఫ్సీఐ గడువు విధించింది.
సీఎంఆర్ నిలిపివేతతో ఇబ్బందులు
కస్టమ్ మిల్లింగ్ నిలిపివేతతో రైస్మిల్లర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2020-21 యాసంగి, 2021-22 వానకాలం సీజన్లకు సంబంధించి సీఎంఆర్ చేసి బియ్యం అందజేయాల్సి ఉండగా.. ఈసారి వానకాలానికు సంబంధించిన వడ్లు సీఎంఆర్ కోసం రైస్మిల్లులకు కేటాయించారు. ఎఫ్సీఐ చేసిన జాప్యం కారణంగా ఎక్కడికక్కడే రైస్మిల్లుల నిండా ఉండిపోయిన వడ్లు, స్థలం సరిపోక ఆరుబయట టార్పాలిన్లు కప్పి ఉంచిన వడ్లు ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. అనుకోకుండా ఈసారి జూలై నెలలో భారీ వర్షాల వల్ల ధాన్యం తడిసి అనేక రైస్మిల్లుల్లో క్వింటాళ్ల కొలది వడ్లు మొలకెత్తాయి. దీంతో ఈ భారం మోయలేనిదిగా తయారైంది. ఎలాంటి ఆటంకం లేకుండా కస్టమ్ మిల్లింగ్ కొనసాగిస్తే ఇప్పటికే గతంలోని వడ్ల సీఎంఆర్ పూర్తయ్యేది. వానకాలంలో అందజేసిన వడ్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అవకాశం కలిగేది.
రోజుకు 900 మెట్రిక్ టన్నులు
ఆగస్టు 31 వరకు సీఎంఆర్ పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వడంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్మిల్లర్లను సమన్వయం చేస్తూ ప్రతిరోజూ సుమారు 900 మెట్రిక్ టన్నుల బియ్యం అందించేలా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఏ రైస్మిల్లు నుంచి ఎంత మొత్తంలో బియ్యం రావాల్సి ఉన్నది పరిశీలించి, అందుకనుగుణంగా రోజూ బియ్యం అందించేలా చర్యలు చేపట్టారు. కస్టమ్ మిల్లింగ్ పూర్తయిన తర్వాత బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు చెందిన జాఫర్పల్లి, షాద్నగర్, తాండూరు, ఖాంజాపూర్, ధారూరు, చంద్రకల్, చిన్నదర్పల్లి, ముదిరెడ్డిపల్లిల్లోని గోదాములకు తరలించడంతోపాటు ఎఫ్సీఐకి చెందిన కౌకుంట్లలోని గోదాముకు తరలించేందుకు అనుమతి ఇచ్చారు. జిల్లాలోని రైస్మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ పూర్తయిన వెనువెంటనే బియ్యం సంబంధిత గోదాములకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు కృషి
– విమల, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్
వికారాబాద్ జిల్లా పరిధిలో 2020-21 యాసంగికి సంబంధించి 10శాతం బాయిల్డ్ రైస్, 2021-22 వానకాలం సీజన్కు సంబంధించి 35 శాతం బియ్యం అందాల్సి ఉన్నది. ఈ నెలాఖరు వరకు కస్టమ్ మిల్లింగ్కు గడువు విధించడంతో గడువు లోపు కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేసి బియ్యం అందజేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రతిరోజూ 900 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేసేలా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నాం.