యాచారం, ఆగస్టు 3 : మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులకు జలకళ సంతరించుకున్నది. చెరువులకు పుష్కలంగా వరదనీరు రావడంతో కొన్ని చెరువులు నిండుకుండలా మారగా, మరికొన్ని చెరువులు మత్తడి పోస్తున్నాయి. తాటిపర్తి గ్రామంలోని బందం చెరువు నిండి బుధవారం అలుగు పారడంతో నానక్నగర్ తలాబ్ చెరువు, మేడిపల్లి ఎక్వ చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. నందివనపర్తి కాముని చెరువుకు భారీగా వరద నీరు వస్తున్నది. తాటిపర్తి పరిధిలోని ఎర్రకుంట, తాటికుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. మరో భారీ వర్షం కురిస్తే ఎక్వ చెరువు ముమ్మరంగా మత్తడి పోస్తుంది. దీంతో మేడిపల్లి సాలి చెరువు, ఊర చెరువు, తక్కళ్లపల్లి చెన్నారెడ్డి చెరువు, చింతపట్ల లక్ష్మణ చెరువుల్లోకి నీరు వస్తుంది. గొలుసుకట్టు చెరువులు పూర్తి స్థాయిలో నిండితే మండలంలో భూగర్భ జలాలు పెరగడంతో పుష్కలమైన సాగునీరు అందనున్నది.