కడ్తాల్, జూలై 25 : ధ్యానాన్ని ప్రపంచం నలువైపులా విస్తరించిన ధ్యాన గురువు సుభాశ్ పత్రీజీ మహోన్నత వ్యక్తి అని, ఆయన ధ్యాన సంకల్పం చాలా గొప్పదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్లోని సరస్వతీ ప్రాంగణంలో బ్రహ్మర్షీ సుభాశ్ పత్రీజీ తుది వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుభాశ్ పత్రీజీ భౌతిక కాయంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. సుభాశ్ పత్రీజీ ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాను స్థాపించి ధ్యానం యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారని తెలిపారు. ధ్యానంతో శాంతియుత సమాజాన్ని నిర్మించడానికి పత్రీజీ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. సుభాశ్ పత్రీజీ శ్వాసపై ధ్యాస అనే నినాదంతో లక్షల మందిని ధ్యానం వైపు మళ్లించారని కొనియాడారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సుభాశ్ పత్రీజీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వేణుగానం, సందేశాలు ధ్యానుల మనస్సుల్లో చిరకాలం గుర్తుండి పోతాయని పేర్కొన్నారు. పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ సుభాశ్ పత్రీజీ మరణం తీరనిలోటని, ఆయన లేరనే విషయాన్ని ధ్యానులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. 2022 డిసెంబర్ నెలలో జరిగే ధ్యాన మహాచక్రాలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ధ్యానుడిపై ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అనంతరం పత్రీజీ కుటుంబ సభ్యులను ప్రజాప్రతినిధులు పరామర్శించారు.
ఆశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
సుభాశ్ పత్రీజీని చివరి చూపు చూసేందుకు తెలుగు రాష్ర్టాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు భారీగా తరలివచ్చారు. సుభాశ్ పత్రీజీ భౌతికకాయం వద్ద నివాళి అర్పించిన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం పిరమిడ్ ఆవరణలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్థలంలో సుభాశ్ పత్రీజీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.